
- ఆంజనేయులు మృతిపై అనుమానాలున్నాయి
- సీఎం ఫామ్హౌజ్ బావిలో పడి చనిపోయిన యువకుడు
- ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన ఈటల
- ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
గజ్వేల్, వెలుగు: సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్లో బావిలో పడి చనిపోయిన ఆంజనేయులు మృతిపై చాలా అనుమానాలున్నాయని, ఈ ఘటనపై విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని వరదరాజ్పూర్లో ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి రూ. 50వేల సాయాన్ని అందజేశారు. బాగా ఈత వచ్చిన ఆంజనేయులు నీటిలో మునిగి చనిపోయాడంటే నమ్మకం కలగడంలేదని, అసలు ఆయన పనికే రాలేదని ముందు పోలీసులు బుకాయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ సమాచారాన్ని బయటకు పొక్కకుండా చూశారని, అక్కడే పోస్టుమార్టం చేశారని, డెడ్బాడీని ఊరికి తీసుకొచ్చిన వెంటనే అంత్యక్రియలు చేసేయాలని తొందర పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికొస్తే తమకు రక్షణ ఉంటుందని ఆశించిన ప్రజలను ఈ ఘటన భయపెడుతోందన్నారు. ఈ ఫామ్ హౌజ్ వచ్చిన తర్వాత హింస అనుభవిస్తున్నట్టు ప్రజలు వాపోతున్నారనితెలిపారు. సీఎం ఫామ్హౌజ్లో చనిపోయిన ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామన్న భరోసా కూడా ఎవరూ ఇవ్వలేదన్నారు. తమ పొలంలో పనిచేస్తూ ఎవరైనా చనిపోతే యజమానులు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని, సీఎం మాత్రం వారిని పట్టించుకోకపోవటం దారుణమన్నారు. చావు ఖర్చులకు రూ.50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు.
వడ్లు కొంటున్నది కేంద్రమే
జడ్చర్ల,వెలుగు : గత ఏడేండ్లుగా వడ్లను కొంటున్నది కేంద్రమేనని, టీఆర్ఎస్ ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గింజ కూడా కేసీఆర్ కొనలేదని హుజూరాబాద్ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ యాసంగి వడ్లపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మహాబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఈద్గాన్పల్లి లో ఆదివారం స్వామి వివేకానందుని విగ్రహాన్ని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణతో కలిసి ఆవిష్కరించారు. మొదటి నుంచి కేంద్రమే వడ్లు కొనుగోలు చేస్తే ,అవి రాష్ట్రమే కొంటున్నట్టు కేసీఆర్ జిమ్మిక్కులు చేశారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హుజూరాబాద్ ఫలితాలే రిపీట్అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ అవినీతి బట్టబయలు కానుందని డీకే అరుణ అన్నారు.రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోందని తెలిపారు.
మల్లన్నకు పట్టుబట్టలు పెట్టిన ఈటల
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మల్లన్న కల్యాణానికి హాజరై, పట్టువస్త్రాలు సమర్పించారు. హూజూరాబాద్లో ధర్మం గెలవాలని కోటొక్క దేవుళ్లను మొక్కానని, ప్రజలు కోరుకున్నట్టుగానే ధర్మ గెలిచిందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అందుకే కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కొమురవెల్లితో సహాతెలంగాణలోని అన్ని గుడులను గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్లు బూరుగు సురేష్, దండ్యాల వెంకట్ రెడ్డి, పంజాల మల్లేశం, ఉడత మల్లేశం యాదవ్, గన్నబోయిన శ్రీను తదితరులు
పాల్గొన్నారు.