నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ మిస్టరీపై ఏఐ సినిమా.. ట్రైలర్‌ విడుదల

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ మిస్టరీపై ఏఐ సినిమా.. ట్రైలర్‌ విడుదల

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘బోస్‌: ది మిస్టరీ అన్‌సాల్వ్‌డ్‌’ పేరుతో మరో చిత్రం రాబోతోంది. ఇందులోని పాత్రలన్నింటినీ ఏఐ టెక్నాలజీతో డిజైన్ చేశారు. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రైలర్‌‌ను విడుదల చేశారు. నేతాజీ మరణం ఓ మిస్టరీ అనే విషయం తెలిసిందే. 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టుగా చెబుతారు. కానీ ఇందుకు సరైన ఆధారాలు లేవు.

ఆ తర్వాత 1985లో ఫైజాబాద్‌లో ఓ సాధువు మరణించడం అక్కడ బోస్‌ పేరుతో ఉన్న లేఖ, ఆయన ఫొటోలు కనిపించడంతో నేతాజీ మరణం చర్చనీయాంశం అయింది. అలాగే నేతాజీ మరణించలేదని, బంధీగా ఉంచారనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్‌‌లో చూపించారు. వచ్చే ఏడాది జనవరి 26న జింగ్‌ రోల్‌ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దీన్ని  స్ట్రీమింగ్ చేయబోతున్నారు.