శ్రీలంకలోని చర్చ్లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా గత ఈస్టర్ ఆదివారం రోజు భీకరమైన బాంబు దాడులు జరిగాయి. కొలంబోలో ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో 8 మంది భారతీయుల సహా 40 మంది విదేశీయులు మృతిచెందారు. వీరిలో బ్రిటన్కు చెందిన అన్నాచెలెళ్లు కూడా ఉన్నారు. బ్రిటన్కు చెందిన మాథ్యూ లిన్సే తన కుమారుడు డేనియల్ (19) అమీలీ (15)తో కలిసి శ్రీలంకలో పర్యటక ప్రదేశాలను చూసేందుకు వచ్చారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజే విహార యాత్ర పూర్తి చేసుకుని బ్రిటన్కు తిరిగు ప్రయాణం కావాల్సి ఉంది.
మాథ్యూ కుటుంబం కొలంబోలోని టేబుల్ వన్ కెఫేలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా బాంబు పేలుడు జరిగింది. దీంతో అక్కడ నుంచి సురక్షితంగా ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణభయంతో హోటల్ షాంఘ్రిలాకు చేరుకోగా, అక్కడ మరో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో మాథ్యు కుమారుడు డేనియల్, కుమార్తె అమీలీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు మాథ్యూ తెలిపారు.
మొదట బాంబు దాడి నుంచి తప్పించుకుని షాంఘ్రిల్లా హోటల్కు వెళ్లినా… అక్కడ జరిగిన పేలుడులో చిక్కుకున్నామన్నారు మాథ్యు పెద్ద కుమారుడు డేవిడ్.