గోవా టూరేసినా.. తగ్గేదేలే

 గోవా టూరేసినా.. తగ్గేదేలే
  •     పీర్జాదిగూడ మేయర్ పీఠంపై వేలాడుతున్న అవిశ్వాసం కత్తి
  •     నోటీసు ఇచ్చేందుకు బీఆర్ఎస్ అసమ్మతి కార్పొరేటర్లు రెడీ! 
  •      సైలెంట్​గా ఉండిపోయిన మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి 

మేడిపల్లి, వెలుగు : మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డికి పదవీ గండం వచ్చినట్లేనా..?  అంటే.. అవుననే వినిపిస్తుంది. సొంత పార్టీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు16 మంది మేయర్ ను పీఠం నుంచి దించేందుకు అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే వారం రోజుల్లో అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. దీంతో చివరకు గోవా టూర్ తో కూడా ఫలితం లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా మేయర్ కు, కొందరు పార్టీ కార్పొరేటర్లకు మధ్య తీవ్ర విబేధాలు ఉండి వర్గ విబేధాలు నడుస్తున్నాయి. 

అప్పటి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ ముందుకెళ్లారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పవర్ లోకి రావడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అసమ్మతి కార్పొరేటర్లను ఈనెల మొదటి వారంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవా టూర్ కు తీసుకెళ్లి చిల్ చేశారు. ఇక పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశించారు. ఇంతలో ఏమైందో ఏమో.. కానీ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో మల్లారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తుంది. 

అధికార మార్పుతో  రివర్స్ ..  

మేయర్ అవినీతి, అక్రమాలే అసలు కారణాలు అంటూ బీఆర్ఎస్ కు చెందిన 26 మంది కార్పొరేటర్లలో కొందరు ఆరోపిస్తున్నారు.  మొదటి నుంచి మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ అసమ్మతి గళం కూడా వినిపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ తో పాటు ఇంకొందరు కార్పొరేటర్లు కలిసి మేయర్ ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి, అక్రమాలను వ్యతిరేకిస్తూ మీడియా ఎదుట కూడా చెప్పుకొచ్చారు. 

అయితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అండదండలతో మేయర్ వెంకట్ రెడ్డి తీరుపై పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇదే అదునుగా భావించిన బీఆర్ఎస్ అసమ్మతి కార్పొరేటర్లు మేయర్ పై మరోసారి అవిశ్వాస తిరుగుబాటు జెండా ఎగురవేసినట్టు తెలుస్తుంది. మేయర్ అవినీతి, అక్రమాలు భరించలేకనే ఒక్కటయ్యామని ఓ కార్పొరేటర్ మీడియా ప్రతినిధులతోనూ చెప్పారు. 

మాజీ మంత్రి సైలెంట్  

సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారం పోయినప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ లో నెలకొన్న అసమ్మతిని సద్దుమణిగించేందుకు కార్పొరేటర్లతో గోవా టూర్ కు వెళ్లి వచ్చిన తర్వాత,  మేడ్చల్ మునిసిపాలిటీ  కౌన్సిలర్లతో  ఏకంగా దుబాయ్ టూర్ కు వెళ్లాడు. ఇంతలోనే జవహర్ నగర్ కార్పొరేషన్ లోని 19 మంది కార్పొరేటర్లు ఆ పార్టీ మేయర్ మేకల కావ్యపై అసమ్మతి ప్రదర్శిస్తూ అవిశ్వాసానికి రెడీ అయి బాపట్ల టూర్ కు వెళ్లారు. 

ఇప్పుడు బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డికి వ్యతిరేకంగా సుమారు 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి సిద్ధమైనట్టు సమాచారం. ఇలా జరుగుతుంటే తనకేమీ పట్టినట్లుగా మల్లారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రస్తుత సీఎంను రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్టు దూషించినది సోషల్ మీడియాలో వైరల్ గా మారినది తెలిసింది.  ప్రస్తుతం పార్టీ అధికారం కోల్పోగా.. ఎమ్మెల్యేగా గెలిచినా మల్లారెడ్డి తన అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సైలెంట్ గా ఉంటున్నట్టు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.