
- ప్రభుత్వ పథకాలపై ఆరా ఓటర్ల వివరాలతో పాటు ఫోన్ నంబర్లు కుడా సేకరణ
- ఫోన్ నంబర్లు తీసుకోవడంపై అనుమానాలు
జయశంకర్ భూపాలపల్లి/ సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సొంత సర్వేలు చేయిస్తున్నారు. తమ అనుచరులు, పార్టీ క్యాడర్ను గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిప్పుతూ ఓటర్ల నుంచి పలు వివరాలు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వాళ్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? ఎంత మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి? వంటి వివరాలు సేకరించి దగ్గర పెట్టుకుంటున్నారు. అయితే, వివరాల సేకరణ వరకు బాగానే ఉన్నా ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత సర్వేలు చేయించడంలో సిద్దిపేట జిల్లా ప్రజాప్రతినిధులు ముందు వరుసలో ఉన్నారు.
ఇప్పటికే సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, గజ్వేల్లో సీఎం కేసీఆర్ సొంత సర్వేలు చేయిస్తుండగా, తాజాగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సర్వే ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ఇప్పటికే ఒక దఫా సర్వే చేయించారు. గ్రామ స్థాయి లీడర్ల చేతికి ఓటర్ లిస్టులు ఇచ్చి ప్రతి వంద మందికి ఓ ఇన్చార్జిని నియమించి ఈ సర్వే చేయించారు. తాజాగా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తన క్యాడర్తో సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేను ఎమ్మెల్యే భార్య, వరంగల్జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి పర్యవేక్షిస్తున్నారు.
ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? వాళ్ల ఇంట్లో ఎవరెవరికి ఏయే స్కీములు అందుతున్నాయి? సిట్టింగ్ ఎమ్మెల్యేపై వాళ్ల అభిప్రాయం ఏమిటి? వ్యతిరేకత ఉంటే ఎందుకు? ఆయా గ్రామాలు, పట్టణాల్లో పెండింగ్ సమస్యలు ఏమి ఉన్నాయి? వంటి వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఫోన్ నంబర్లు కూడా సేకరిస్తున్నారు. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, గ్రామాల్లో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షుల సేవలను వాడుకుంటున్నారు. వారంతా రోజుకు వంద ఇండ్ల చొప్పున సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా సర్వే పూర్తయిందని బీఆర్ఎస్వర్గాలు చెప్తున్నాయి.
ఫోన్ నంబర్లు ఎందుకో?
సర్వేలో భాగంగా ఓటర్లు, స్కీములు వంటి వివరాలు సేకరించడం వరకు బాగానే ఉన్నా ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఫోన్లు చేసి, ఓటు అడిగేందుకు, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ల ద్వారా ప్రచారానికి వాడుకుంటామని బీఆర్ఎస్ క్యాడర్ చెప్తున్నప్పటికీ ఈ ఫోన్ నంబర్ల సేకరణ వెనుక భారీ వ్యూహం దాగి ఉందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్ల ద్వారా ఓటర్లకు ఆన్లైన్లో డబ్బులు పంపి, ఓట్లు కొనేందుకే అధికార పార్టీ నేతలు ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారని ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు. గతంలో హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషన్కు దొరక్కుండా రూలింగ్ పార్టీ ఇదే ఎత్తుగడ వేసిందని వారు తెలిపారు. మొత్తం మీద మరో వారం, పది రోజుల్లో ఇలాంటి సర్వేలు రాష్ట్రమంతా ఊపందుకునే అవకాశముంది.