భారత్నెట్కు రూ.6 వేల కోట్లు కేటాయించిన సర్కార్
క్వాంటమ్ కంప్యూటింగ్కు రూ.8 వేల కోట్లు
దేశంలోనే ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తయారు చేసేలా కొత్త విధానం
ఊళ్లలో ఇంటర్నెట్ (బ్రాడ్బ్యాండ్) సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత్నెట్ మిషన్ను ప్రారంభించింది. అందులో భాగంగా ఈ ఒక్క ఏడాదిలో లక్ష ఊళ్లకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. అందుకు రూ.6 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ‘‘పంచాయతీల్లోని అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, రేషన్ షాపులు, పోస్ట్ ఆఫీసులు, పోలీస్స్టేషన్లలో డిజిటల్ కనెక్టివిటీని పెంచడమే మా లక్ష్యం. భారత్నెట్ ద్వారా చేపట్టే ద ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్టీటీహెచ్) కార్యక్రమం ద్వారా ఈ ఒక్క ఏడాదిలోనే లక్ష గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇస్తాం’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్స్, డేటా స్టోరేజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరగరాస్తున్నాయన్నారు. నగదు బదిలీ వంటి పథకాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా టెక్నాలజీని వాడుకుంటోందని చెప్పారు. డేటా సెంటర్ పార్కులను ప్రైవేటు వాళ్లు ఏర్పాటు చేసేలా త్వరలో కొత్త విధానాలను తీసుకొస్తామన్నారు.
క్వాంటమ్ కంప్యూటింగ్కు ఫ్యూచర్
కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కొత్త దారులు తెరుస్తోందని, మున్ముందు మరిన్ని కొత్త అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున క్వాంటమ్ కంప్యూటింగ్కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందులో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం వచ్చే ఐదేళ్ల కాలానికి రూ.8 వేల కోట్ల క్యాపిటల్ ఔట్లేని ఆమె బడ్జెట్లో ప్రకటించారు. నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ కింద ఈ బడ్జెట్ను కేటాయించారు. ‘‘మనం క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేయగలిగితే, ప్రపంచంలో దానిని సాధించిన మూడో దేశంగా మనం చరిత్ర సృష్టిస్తాం’’ అని నిర్మల చెప్పారు.
సైన్స్కు అంతంతే
సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ సారి బడ్జెట్ కేటాయింపుల్లో పెంపు నామమాత్రంగానే ఉన్నాయి. సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు గత ఏడాది రూ.4,895 కోట్లు కేటాయించిన సర్కారు, ఈసారి రూ.5,385 కోట్లు ప్రతిపాదించింది. అందులోనూ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కే రూ.5,312 కోట్లు ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.6,301.53 కోట్లు ప్రతిపాదించింది. బయోటెక్నాలజీకి రూ.2,786.76 కోట్లు, ఎర్త్సైన్సెస్ డిపార్ట్మెంట్కు రూ.2,070 కోట్లు, భారత వాతావరణ సంస్థకు రూ.443 కోట్లు కేటాయించింది. ఎర్త్సైన్సెస్కు ఈసారి రూ.170 కోట్లు పెంచింది.
దేశీ ఫోన్లు
ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ను దేశంలోనే తయారు చేసేలా కంపెనీలను ప్రోత్సహిస్తామని నిర్మల సీతారామన్ చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కొన్ని మార్పులను చేసి వైద్య పరికరాలను ఇక్కడే తయారు చేసేలా విధానాలు రూపొందిస్తామన్నారు. ‘‘దేశంలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ వాల్యూ చెయిన్లో మనం భాగం కావాలి. దాని వల్ల దేశంలోని యువతకు ఉపాధి దొరుకుతుంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా కాంపిటీటివ్గా ఉంది. అయితే, ఉత్పత్తి ఖర్చు విషయంలో ఇండియాకు చాలా అడ్వాంటేజ్ ఉంది’’ అని చెప్పారు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ను ఇండియాలోనే తయారు చేసేలా భారీగా పెట్టుబడులను తీసుకురావాల్సినఅవసరం ఉందన్నారు.