- జొమాటో ఐపీఓపై ఇన్వెస్టర్ల డైలమా!
- వాల్యుయేషన్, ఐపీఓ ధర చాలా తక్కువ
- కంపెనీకి ఇప్పటివరకు ప్రాఫిట్స్ లేవు
- మరోవైపు కంపెనీ కస్టమర్లు, ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది
బిజినెస్డెస్క్, వెలుగు: డెలివరీ వచ్చేంత వేగంగా షేర్లతో లాభాలు రాకపోవచ్చు. జనాలకు బాగా తెలిసిన బ్రాండ్ కావడం, మార్కెట్లో లిస్ట్ అవుతున్న మొదటి కన్జూమర్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ అవ్వడం, తాజ్ హొటల్స్, ఓబ్రాయ్ హొటల్స్ వంటి కంపెనీల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్తో వస్తుండడం...ఇవన్ని చూస్తుంటే ఎవరికైన జొమాటో ఐపీఓపై ఆసక్తి పెరుగుతుంది. ఐపీఓలో మనకు షేర్లు అలాట్ అవుతాయా? అవ్వవా? మొత్తం సేవింగ్స్ను ఈ ఐపీఓలో పెట్టేయాలా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. జొమాటో ఐపీఓ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి జరుగుతోంది. నిజంగా కంపెనీ ఐపీఓకి సబ్స్క్రయిబ్ అయితే లాభాలొస్తాయా? ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. కానీ, జొమాటో ఐపీఓపై ఇన్వెస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయారని మాత్రం చెప్పొచ్చు. కొంత మంది కంపెనీ వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉందని, ఐపీఓ ధర కూడా చాలా ఎక్కువని చెబుతున్నారు. కంపెనీకి ఇప్పటి వరకు లాభాలు రాలేదని, ఇంటర్నెట్ కన్జూమర్ ప్లాట్ఫామ్ కాబట్టి కస్టమర్లను ఆకర్షించడానికి వచ్చిన ప్రాఫిట్స్ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు జొమాటో కస్టమర్ల బేస్ పెరుగుతోందని, ఫుడ్ డెలివరీ బిజినెస్కు డిమాండ్ ఎక్కువవుతోందని మరికొంత మంది ఇన్వెస్టర్లు పేర్కొంటున్నారు. జొమాటో లాభాల్లోకి రావాలంటే కనీసం ఐదేళ్లు పడుతుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
జొమాటో కంపెనీ పరిస్థితేంటి..?
సెబీ వద్ద ఫైల్ చేసిన పేపర్లలో రూ. 8 వేల కోట్లను సేకరిస్తామని జొమాటో పేర్కొంది. కానీ, కొన్ని వారాల్లోనే ఐపీఓ సైజ్ను రూ. 9 వేల కోట్లకు పెంచింది. వాల్యుయేషన్ కూడా 8 బిలియన్ డాలర్లగా లెక్కించి ఐపీఓ ధరను నిర్ణయించింది. ఈ వాల్యుయేషన్ జుబిలంట్ ఫుడ్ వర్క్స్ కంటే ఎక్కువ. జుబిలంట్ సౌత్ ఆసియాలో డొమినోస్ పిజ్జా ఫ్రాంచైజ్ని నడుపుతోంది. ఈ కంపెనీ రెవెన్యూలో మూడో వంతు ఇబిటా(ఆపరేషనల్ ప్రాఫిట్) ఉంటోంది. కానీ, జొమాటో ఖర్చులు రెవెన్యూని మించిపోతున్నాయి. లాంగ్ టెర్మ్లో జొమాటోకు భారీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలున్నాయని, కానీ, షార్ట్ టెర్మ్లో కష్టమని సెరికా పీఎంఎస్ ఎండీ అభయ్ అగర్వాల్ పేర్కొన్నారు. కంపెనీ కస్టమర్లు పెరిగారని, ఆర్డర్ల సంఖ్య కూడా పెరుగుతోందని అన్నారు. సగటు ఆర్డర్ ధర కిందటేడాది రూ. 240 ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి రూ. 400 కు పెరిగిందని చెప్పారు. ‘ఈ మొత్తంలో రూ. 90 మాత్రమే జొమాటోకి వెళుతోంది. ఇందులో డెలివరీ పార్టనర్లు, జొమాటో డిస్కౌంట్ల ఖర్చులు ఉంటాయి’ అని అభయ్ అన్నారు. డెలివరీ ఖర్చు రూ. 65 నుంచి రూ. 48 తగ్గిందని, కంపెనీ ఇచ్చే డిస్కౌంట్లు కూడా రూ. 20 నుంచి రూ. 8 కు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతానికి జొమాటో కేవలం 1.48 లక్షల రెస్టారెంట్లతో మాత్రమే టై అప్ అయ్యింది. గ్లోబల్గా ఉన్న ఫుడ్ నెట్వర్ కంపెనీల్లో జొమాటోదే తక్కువని అభయ్ పేర్కొన్నారు. అదే చైనాలోని మెటున్ డైన్పింగ్కు 68 లక్షల రెస్టారెంట్ల నెట్వర్క్ ఉందని అన్నారు. దేశంలో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లకు మరింత డిమాండ్ క్రియేట్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త జనరేషన్ 90 శాతం మీల్స్ను ఆన్లైన్లోనే పెట్టుకుంటాయని అంచనా వేశారు. కాగా, గ్లోబల్గా ఫుడ్ డెలివరీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. కరోనా సంక్షోభం టైమ్లో వీటి బిజినెస్లు పెరిగాయి.
రిటైల్ ఇన్వెస్టర్లు ఆలోచించుకోవాలి..
రిటైల్ ఇన్వెస్టర్లు అన్ని విషయాలను రీసెర్చ్ చేసుకొని జొమాటో ఐపీఓకి సబ్స్క్రయిబ్ అవ్వాలి. గ్రే మార్కెట్లో షేర్ల ప్రీమియం గత కొన్ని రోజుల నుంచి తగ్గుతోంది. వారం కిందట ఐపీఓ ధర కంటే 25 శాతం ఎక్కువ ధర వద్ద చేతులు మారిన జొమాటో షేర్లు, ప్రస్తుతం 13 శాతం ఎక్కువ ధరకు ట్రేడవుతున్నాయి. ‘ తాజాగా ఐపీఓకి వచ్చిన జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీ కంపెనీలను తీసుకుంటే, వీటి బిజినెస్ మోడల్ స్టడీగా ఉంది. ఇంకో ఐదేళ్ల తర్వాత కూడా ఈ కంపెనీలు ఏ పొజిషన్లో ఉంటాయో అంచనావేయొచ్చు. కానీ, జొమాటో విషయంలో ఇన్వెస్టర్లలో ఏకాభిప్రాయం కుదరలేదు’ అని ఇన్వెస్టర్జోన్ ఫౌండర్ ఉమేష్ పలివాల్ పేర్కొన్నారు. ఇన్వెస్ట్ చేయొచ్చు కాని, సేవింగ్స్ను కూడా తెచ్చి జొమాటో ఐపీఓలో పెట్టవద్దని ఎనలిస్టులు చెబుతున్నారు. స్టేబుల్గా ఉండే కంపెనీలను చూసుకోవడం బెటర్ అంటున్నారు.