ములుగు, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో తీరొక్క సీతాకోకచిలుకలు వెలుగులోకి వస్తున్నాయి. బటర్ ఫ్లై అండ్ చిమ్మట సర్వేలో కొత్త జాతులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ నెల 6 మొదలైన సర్వే 9వ తేదీన ముగియనుంది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలు సర్వేలో పాల్గొనగా ములుగు ఫారెస్ట్ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది వలంటీర్లు భాగస్వాములయ్యారు.
రెండు రోజుల సర్వేలో సీతాకోక చిలుకల జాతుల రకాలు, ఆహారపు అలవాట్లపై వివరాలు సేకరించారు. అంతేగాకుండా చిమ్మటల డేటా తీసుకున్నారు. తాడ్వాయి అడవుల్లో రెండు బృందాలు, మేడారంలో ఒక బృందం, లక్నవరం సరస్సు పరిసరాల్లో మరో బృందం పర్యటిస్తున్నాయి.
వీరి అన్వేషణలో ఇప్పటికే 60 కొత్త సీతాకోకచిలుకల జాతులు బయటపడ్డాయి. వీటి జీవన స్థితిగతులపై డాక్యుమెంటరీ రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనున్నారు. బటర్ఫ్లై సర్వే ద్వారా ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తోందనిడీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు.
