- గతంలో సుమారు 500 కోట్లు శాంక్షన్ చేసిన సర్కారు
- అప్పుడు వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు తప్ప కొత్తగా ఏ పనీ చేయలే
- కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, మహిళా సంఘాల బిల్డింగ్స్ అన్నీ ఆగినయ్
- చేసిన పనుల బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు
కరీంనగర్, వెలుగు: ‘‘మీ సమస్యలన్నీ పరిష్కరిస్తం. ఊరూరా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కులసంఘాలకు కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, ఫంక్షన్ హాళ్లు, పంచాయతీ బిల్డింగులు, హెల్త్ సెంటర్లు.. అవీ.. ఇవీ.. అన్నీ నిర్మించి ఇస్తం. ఏ ఇబ్బందీ లేకుండా చూస్తం” అంటూ హుజూరాబాద్ బై ఎలక్షన్కు ముందు చెప్పిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నియోజకవర్గంలో పత్తాలేరు. ఎన్నిక కాగానే ఎక్కడోళ్లు అక్కడికి వెళ్లిపోయారు. బైపోల్కు ముందు వివిధ పనులకు రూ.500 కోట్లు శాంక్షన్ చేయగా.. 20 శాతం పనులు కూడా జరిగాయి. కానీ తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కాంట్రాక్టర్లకు 20 శాతం పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఆగిపోయాయి. హుజూరాబాద్లో బీజేపీ గెలిచినందువల్లే పనులు ఆపేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికకు ముందు ఎడాపెడా హామీలు
హుజూరాబాద్ బై ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని భావించిన టీఆర్ఎస్ సర్కారు అంతకు రెండు, మూడు నెలలు ముందే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. వాళ్ల సాయంతో నియోజకవర్గంలోని టౌన్లు, మండల కేంద్రాలు, గ్రామాల వారీగా ఏయే పనులు అవసరమో గుర్తించింది. ఈ క్రమంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, ఐలాండ్స్, మార్కెట్యార్డులు, కమ్యూనిటీ హాళ్ల కోసం మొదటి విడత రూ.200 కోట్లు శాంక్షన్ చేసింది. నోటిఫికేషన్ ముందే పనులు కావాలనే లక్ష్యంతో కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు హడావుడిగా పూర్తిచేశారు. బాగా ఉన్న రోడ్ల మీద సైతం మళ్లీ రోడ్లు వేశారనే ఆరోపణలు వచ్చాయి. టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి హరీశ్రావు రంగంలోకి దిగిన తర్వాత హామీలు, ఫండ్స్ శాంక్షన్ స్పీడ్ అందుకుంది. ఆయన మండలాలవారీగా కులసంఘాలతో మీటింగులు పెడుతూ కులసంఘాల భవనాలకు, కులదేవతల ఆలయాలకు కావాల్సిన భూమి, ఫండ్స్ వేదికలపైనే మంజూరు చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తామని కులసంఘాల పెద్దలతో తీర్మానాలు రాయించుకున్నారు. వందలాది కమ్యూనిటీ హాళ్లు, ఆలయాలు, చర్చిలకు స్థలాలు, ఫండ్స్ శాంక్షన్ చేయడమేగాక, స్వయంగా మంత్రి హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్ లాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి పూజలు చేశారు. ఫండ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, రాబోయే మూడు నెలల్లో పూర్తిచేస్తామని హామీలు ఇచ్చి వచ్చారు. మొత్తం మీద మొదట్లో ఇచ్చిన రూ.200 కోట్లతో పాటు మరో రూ.300 కోట్లను శాంక్షన్ చేయడంతో ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా, ఓడినా అభివృద్ధి పనులు జరుగుతాయని నియోజకవర్గ ప్రజలు భావించారు.
తట్టెడు మట్టి కూడా ఎత్తలే
బై ఎలక్షన్స్ టైంలో శాంక్షన్ఇచ్చిన రూ. 500 కోట్లలో ఎస్డీఎఫ్ కింద కొన్ని, ఈజీఎస్ కింద కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఎస్డీఎఫ్ గ్రాంట్ కింద రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో హుజూరాబాద్ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, రూరల్కు రూ.15 కోట్లు, జమ్మికుంట మునిసిపాలిటీకి రూ.15 కోట్లు, రూరల్కు రూ.10 కోట్లు ఇచ్చారు. వీణవంక మండలానికి రూ.15 కోట్లు, ఇల్లందకుంటకు రూ.10 కోట్లు, కమలాపూర్ మండలానికి రూ.20 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాలు, పట్టణాల్లో ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రైయిన్లు, దళిత వాడల అభివృద్ధి, వంతెనలు, బీటీ రోడ్ల నిర్మాణం లాంటివి చేయాలని సూచించారు. ఆయా పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. హుజూరాబాద్, జమ్మికుంటలో కొన్ని బ్యూటిఫికేషన్ వర్క్స్ చేశారు. కానీ మిగిలిన చోట్ల తట్టెడు మట్టి కూడా ఎత్తిన దాఖలాలు లేవు. రెడ్డి, ఆర్య వైశ్య, యాదవ, ముదిరాజ్, గౌడ, నాయి బ్రహ్మణ, రజక.. ఇలా అన్ని కులాలకు భవనాలు, కొన్ని కులాలకు గుళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో అయితే స్థలాలు కూడా చూపించారు. కానీ ఆ స్థలాల్లో అప్పుడు వేసిన శిలాఫలకాలు తప్ప.. ఏమి కనిపించడం లేదు. 298 కమ్యూనిటీ హాళ్లను రూ.24 కోట్లతో నిర్మిస్తామని చెప్పినా.. ఇందులో 286 కమ్యూనిటీ హాళ్ల దగ్గర ఎలాంటి పనీ చేపట్టలేదు. 43 గుళ్లు నిర్మిస్తామని చెప్పారు. కానీ 38 టెంపుల్స్వద్ద శిలాఫలకాలు తప్ప ఇంకేమీ లేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు 30, గ్రామైక్య సంఘాలకు భవనాలు 70, గ్రామాల్లో సబ్ సెంటర్లు ఐదు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇందులో 26 పంచాయతీ భవనాలు, 63 వీవో బిల్డింగ్లు, ఐదు సబ్ సెంటర్ల వద్ద పనులు స్టార్ట్ కాలేదు. రూ.25 కోట్లతో ఇతర బిల్డింగ్ లు, క్రీడా మైదానాలను డెవలప్ చేస్తామని చెప్పినా ఎక్కడా పనులు మొదలుకాలేదు. ఎన్నికల షెడ్యూల్కు ముందు మొదలుపెట్టిన సీసీ రోడ్లు, డ్రైయిన్ పనులను స్థానికంగా ఉన్న కొందరు లీడర్లు, చోటామోటా కాంట్రాక్టర్లు చేశారు. పనులు చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. దీంతో అసలు ప్రభుత్వానికి శాంక్షన్ చేసిన పనులు చేపట్టే ఉద్దేశం ఉందా లేదా అనే అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
ఇచ్చిన స్థలాలు వివాదాస్పదమే
కమ్యూనిటీ హాళ్లు, వివిధ నిర్మాణాల కోసం ఆఫీసర్లు హడావుడిగా సెలక్ట్ చేసిన స్థలాలు వివాదాస్పదమయ్యాయి. హుజూరాబాద్లో ఎస్సారెస్పీ ల్యాండ్లో 10 ఎకరాల వరకు ఆటో నగర్ కోసం ఇచ్చారు. ఎన్నికల టైమ్లో సుమారు 300 మందికి పైగా లబ్ధిదారులకు పట్టాలు అందించారు. కానీ ఇప్పుడు ఆ స్థలంలో ఎలాంటి అభివృద్ధి లేదు. 71 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం రెండెకరాల 20 గుంటలు అందించారు. కానీ ఇక్కడ ప్రైవేటు వాళ్ల ల్యాండ్ ఉండడంతో వాళ్లంతా కోర్టు నుంచి స్టే తెచ్చారు. ఆర్యవైశ్య సంఘం కోసం ఎకరా, జర్నలిస్టుల కాలనీ కోసం మూడెకరాలు కేటాయించగా, ఆ భూమిని ఇచ్చేందుకు ఎస్సారెస్పీ ఆఫీసర్లు ఒప్పుకోలేదు. జర్నలిస్టులకైతే ఏకంగా ఆ స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 5 లారీల కంకర, 5 లారీల ఇసుక, ఓ లారీలో సలాకలు తెచ్చి వేశారు. తీరా ల్యాండ్ ఇష్యూ అనే సాకుతో సలాకతో సహా అన్నింటినీ తీసుకొని వెళ్లిపోయారు.