న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్పై కరుడుగట్టిన ఐఎస్(కె) దాడికి తెగబడింది. ఎయిర్పోర్టు దగ్గర రోజుల తరబడి ఎదురుచూస్తున్న జనం టార్గెట్గా ఇద్దరు సూసైడ్ బాంబర్లతో దాడి చేసినట్లు ప్రకటించుకుంది. ఈ బ్లాస్ట్లో 170 మందికి పైగా మృతి చెందారు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు, వాళ్లు, వీళ్లూ అని చూడకుండా కాల్పులు, బ్లాస్ట్లకు ఈ ఐఎస్(కే)గ్రూప్ తెగబడుతుంటుంది.
స్థావరాలు ఎక్కడున్నయ్?
తొలుత పాక్ బార్డర్లో కొన్ని ఏరియాలకే పరిమితమైన ఐఎస్(కె) క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ప్రస్తుతం మిగతా టెర్రరిస్టు గ్రూపుల కన్నా తీవ్రమైన, భయంకరమైన గ్రూప్గా మారింది. ఇటీవలి కాలంలో తూర్పు అఫ్గాన్లో ఐఎస్(కె) టెర్రరిస్టులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. నంగార్హర్, కునార్ ప్రావిన్స్లో బలంగా ఉంది. ఇక్కడి నుంచి డ్రగ్స్, జనాల స్మగ్లింగ్ జరుపుతుంటుంది. కాబూల్లో ఈ గ్రూప్ కొన్ని సెల్స్ ఏర్పాటు చేసింది.
బలం పెంచుకుంటోందా?
పాక్, అఫ్గాన్లో ఈ గ్రూప్ యాక్టివ్గా ఉంది. అఫ్గాన్లోని అన్ని జీహాదీ మిలిటెంట్ గ్రూప్లలో చాలా డేంజరస్ గ్రూప్. పాక్, అఫ్గాన్లకు చెందిన జీహాదీలను రిక్రూట్ చేసుకుంటుంది. తాలిబాన్లతో దగ్గరి సంబంధాలున్న హక్కాని నెట్వర్క్తో ఐఎస్(కె)కు సంబంధాలున్నాయని తేలింది. అఫ్గాన్లో ప్రభుత్వం కూలిపోయాక ఈ నెల తొలివారం నుంచి రిక్రూట్మెంట్స్ను ఈ గ్రూప్ మొదలుపెట్టిందని అమెరికా ఇంటెలిజెన్స్ చెప్పింది. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ గ్రూప్లో 3 వేల మంది ఉన్నట్లు అంచనా. అయితే అఫ్గాన్, అమెరికా మిలటరీ, తాలిబాన్ల దాడుల్లో చాలామంది మృతి చెందినట్టు సమాచారం. తాలిబాన్లు జైళ్ల నుంచి టెర్రరిస్టులను వదిలేశారు. దీంతో వీళ్ల సంఖ్య మళ్లీ పెరిగినట్టు తెలిసింది.
తాలిబాన్లతో లింక్ ఉందా?
ఐఎస్, తాలిబాన్ రెండూ సున్నీ ఇస్లామిస్ట్ టెర్రరిస్టు గ్రూప్లే కానీ రెండు గ్రూప్లకూ ఒకరంటే ఒకరికి పడదు. ఈ గ్రూప్ల ఐడియాలజీ కూడా వేరని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ అట్ స్టాన్ఫర్డ్ వర్సిటీ చెబుతోంది. తాలిబాన్లు జీహాద్ను, యుద్ధాన్ని వదిలేశారని, శాంతి మంత్రం జపిస్తున్నారని ఐఎస్(కె) మండిపడింది. దోహా, ఖతర్లోని హోటళ్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించింది. అమెరికాతో చర్చలు జరపడం నచ్చని తాలిబాన్లు ఐఎస్లో చేరారని అసోసియేట్ ప్రెస్ పేర్కొంది. ఐఎస్(కె) గ్లోబల్ ఐఎస్ నెట్వర్క్లో భాగస్వామిగా ఉంది.
ఎవ్వరినీ వదలరు
కాబూల్తో పాటు ఇతర అఫ్గాన్ నగరాల్లో ఐఎస్(కె) సూసైడ్ బాంబింగ్స్కు పాల్పడింది. తాము భయంకరమైన మిలిటెంట్ గ్రూప్ అని ప్రపంచానికి చెప్పేందుకు ఈ దాడులు చేసినట్టు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రామ పెద్దల నుంచి రెడ్క్రాస్ వర్కర్ల వరకు చాలా మందిని వీళ్లు చంపేశారు. జనం ఎక్కువుండే ప్రాంతాల్లో సూసైడ్ బాంబర్ల ద్వారా దాడులకు తెగబడ్డారు. షియా మైనార్టీ గ్రూప్లపై ఎక్కువగా అటాక్ చేశారని ఆరోపణలున్నాయి. ఈ మధ్యకాలంలో సూఫీ మసీదు, పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు, ఆయిల్ ట్యాంకర్లు, కాబూల్లో షియా ముస్లింలు ప్రయాణించే బస్సులపై దాడి చేశారు. షియా హజారా మైనార్టీలకు చెందిన ఓ బాలికల స్కూల్పైనా ఐఎస్(కె) దాడి చేసిందని అమెరికా అధికారులు అంటున్నారు. మెటర్నిటీ వార్డుల్లో నర్సులు, ప్రెగ్నెంట్ మహిళలపై కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు.
ఏంటీ ఐఎస్(కె)?
ఐఎస్కు అనుబంధంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ ఐఎస్(కే)(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ ఖొరాసన్ ప్రావిన్స్). ఈశాన్య, ఉత్తర అఫ్గాన్, దక్షిణ తుర్కెమెనిస్తా న్ను కలిపి ఒకప్పుడు ఖొరాసన్గా పిలిచేవారు. ఈ ప్రాంతం నుంచి ఖొరాసన్ పేరుతో ఐఎస్(కే )మొద లైంది. తొలిసారి 2014లో తూర్పు అఫ్గాన్లో దీని కార్యకలాపాలను గుర్తించారు. పాకిస్తాన్ నుంచి అఫ్గాన్ వెళ్లిన పాక్ తాలిబాన్లు ఈ గ్రూప్ను స్థాపించారని ఐఎస్పై రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్స్ చెబుతున్నా రు. సిరియాకు చెందిన జీహాదీలు, ఉజ్బెకిస్తాన్, అఫ్గాన్కు చెందిన టెర్రరిస్టులు, ఇతర దేశాల టెర్రరిస్టు లూ ఈ గ్రూప్లో ఉన్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్ చెబుతోంది.
ఇండియాలో ఇస్లాం రాజ్యమే లక్ష్యం
ఐఎస్(కె) అంతిమ లక్ష్యం మన దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపనేనని కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. మొదట అఫ్గాన్, అక్కడి నుంచి సెంట్రల్ ఆసియా, ఆపై ఇండియాకు జిహాద్ను విస్తరించాలన్నది ఐఎస్(కె) లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం టెర్రర్ అటాక్స్ నిర్వహిస్తూ, యువతను రిక్రూట్ చేసుకోవడమే టాప్ ఎజెండాగా పెట్టుకున్నారని చెప్పారు. అఫ్గాన్తో సహా సెంట్రల్ ఆసియాలో ఇస్లామిక్ రాజ్యం(కాలిఫేట్)ను స్థాపించాలని, అందులో ఇండియాను కూడా చేర్చాలన్నది వాళ్ల ఫైనల్ ఎజెండా అని పేర్కొంటున్నారు. ఇప్పటికే కేరళ, ముంబై నుంచి కొతమంది యువత ఐఎస్లో చేరారు. అఫ్గాన్లో పట్టు సాధించాక, మన దేశంలోని ఐఎస్ సెల్స్ ను యాక్టివేట్ చేసే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు.