
న్యూఢిల్లీ: టీసీఎస్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తుంటే, క్యాప్ జెమినీ ఇండియా మాత్రం ఈ ఏడాది 40 వేల నుంచి -45 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించింది. కంపెనీ సీఈఓ అశ్విన్ యార్డి మాట్లాడుతూ, ‘‘కొత్తగా నియమించుకునే వారిలో 35–-40శాతం మంది ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులు ఉంటారు.
ప్రస్తుతం భారత్లో 1.75 లక్షల మంది మా కంపెనీలో పనిచేస్తున్నారు. గ్లోబల్గా క్లయింట్ డిమాండ్ పెరుగుతోంది. ఖర్చు తగ్గించుకునేందుకు ఇండియాలో హైరింగ్ పెంచాలని నిర్ణయించుకున్నాం”అని యార్డి తెలిపారు. నియామకాలకు 50కి పైగా కాలేజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న క్యాప్జెమినీ, ఏఐ శిక్షణపై దృష్టి సారించి, రిక్రూట్మెంట్ను ప్రారంభించింది.
కాగా, తాజాగా టీసీఎస్ గ్లోబల్గా 12 వేల మంది ఉద్యోగాలును తీసేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్ఫోర్స్లో 2 శాతానికి సమానం. మరోవైపు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ మాత్రం ఈ ఏడాది 17 వేల మందిని నియమించుకున్నామని, మరో 20 వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను తీసుకోనున్నామని తెలిపారు. కాగా, క్యాప్జెమినీ 3.3 బిలియన్ డాలర్లకు బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) సంస్థ డబ్యూఎన్ఎస్ను కొనుగోలు చేసింది. అయితే ఏఐ వలన బీపీఓ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.