
- సీఈఐఆర్ ద్వారా మొబైల్స్ స్వాధీనం
- ఇప్పటివరకు జిల్లాలో 570 సెల్ ఫోన్లు రికవరీ
- బాధితులకు అప్పగింత
సూర్యాపేట, వెలుగు : ప్రతిఒక్కరికీ మొబైల్ నిత్య జీవితంలో భాగమైంది. ఎటు వెళ్లినా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. సమాజంలో మొబైల్ నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి సమాచారంతోపాటు బ్యాంకు వివరాలను సైతం ఫోన్లో భద్రపరుచుకుంటున్నాం. అలాంటి మొబైల్స్ ఎక్కడైనా పడిపోతే.. లేదా దొంగలిస్తే ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనుంచి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెంటనే సీఈఐఆర్కు ఫిర్యాదు చేస్తే చాలు.. మీ ఫోన్ ఎక్కడున్నా పోలీసులు వెతికిపట్టుకుంటారు.
సీఈఐఆర్ పోర్టల్అందుబాటులోకి..
కాల్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, యూట్యూబ్, నగదు చెల్లింపులతో మొబైల్ మన నిత్య జీవితంలో భాగమైంది. మొబైల్ఎక్కడైనా మిస్అయితే ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ క్రమంలో మిస్సింగ్ ఫోన్లను రికవరీ చేసేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ సెంట్రల్ఎక్విప్మెంట్ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా పోగొట్టుకున్నా.. చోరీకి గురైన ఫోన్లను పోలీసులు గుర్తిస్తారు.
జిల్లాలో ఇప్పటివరకు 570 రికవరీ..
సూర్యాపేట జిల్లా పరిధిలో సీసీఎస్, ఐటీ సెల్ఆధ్వర్యంలో మిస్సింగ్, చోరీకి గురైన మొబైల్స్ను రికవరీ చేసేందుకు స్పెషల్ టీంలు పని చేస్తున్నాయి. అంతేకాకుండా అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో మొబైల్స్ మిస్సింగ్, చోరీకి గురైనట్టు 1137 ఫిర్యాదులు వచ్చాయి. అయితే వాటిలో ఇప్పటివరకు 570 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పోలీసులు అందజేశారు.
ఫిర్యాదు చేయండి ఇలా..
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ముందుగా సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. సీఈఐఆర్ వెబ్ సైట్లోకి వెళ్లగానే రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్, స్టోలెన్ మొబైల్ లింక్ కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో సెల్ఫోన్కు సంబంధించిన 15 డిజిట్స్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్, కంపెనీ పేరు, మోడల్పేరు, బిల్లులను వెబ్సైట్లో నమోదు చేయాలి. తర్వాత ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఈ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత ఫిర్యాదుదారుడి ఐడీ నంబర్ వస్తుంది. అనంతరం ఆ మొబైల్ పని చేయకుండా చేస్తుంది. ఏ కంపనీ సెల్ఫోన్ అయినా సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయగానే బ్లాక్ అవుతుంది. ఇక దాన్ని ఎవరూ వినియోగించలేరు. దీంతోపాటు ఫోన్ ఎక్కడ ఉందనే వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్లోని ఐటీ సెల్కు
అందిస్తుంది.
మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి
మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన వెంటనే సీఐపీఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తే సంబంధిత షాపు యజమాని నుంచి రసీదు తీసుకోవాలి. దొంగలించిన ఫోన్ అని తెలిసి కొనుగోలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మొబైల్ రికవరీ కోసం పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుంది.
ఎస్పీ నరసింహ