
- నేడు కృష్ణా, గోదావరి బోర్డుల జ్యూరిస్డిక్షన్పై గెజిట్ నోటిఫికేషన్
- అధికారికంగా ప్రకటించిన కేంద్ర జలశక్తి శాఖ
- ఏపీ, తెలంగాణ జలవివాదాల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి రానున్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్బోర్డు (జీఆర్ఎంబీ)ల జ్యూరిస్డిక్షన్ శుక్రవారం నోటిఫై చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు పెరిగిన నేపథ్యంలో బోర్డుల పరిధిని నిర్ధారించేందుకు కేంద్రం మొగ్గు చూపించింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ప్రాజెక్టుల పరిధిలోని అన్ని ఔట్లెట్లు, పంపుహౌస్లు, పవర్ హౌస్లు ఆయా బోర్డుల ఆధీనంలోకి రానున్నాయి. నిరుడు అక్టోబర్ ఆరో తేదీన నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలతో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ డ్రాఫ్ట్ జ్యూరిస్డిక్షన్ను అక్టోబర్ 9న కేంద్రానికి పంపారు. దీనిపై ఏప్రిల్ రెండో వారంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమై బోర్డుల జ్యూరిస్డిక్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 85లో ఉన్న సబ్ సెక్షన్ 7 ప్రకారం ప్రాజెక్టులు, వాటి నుంచి నీటిని తరలించే ఔట్లెట్ల వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్ని ఇకపై కృష్ణా, గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా అన్నింటి నిర్వహణను ఇకపై బోర్డులే చూసుకుంటాయి. బోర్డుల పరిధి, నిర్వహణ గైడ్ లైన్స్ పై గురువారం రాత్రి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 14 నుంచి ఈ గెజిట్ అమల్లోకి రానుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. పర్మిషన్ లేని ప్రాజెక్టులకు గెజిట్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు పర్మిషన్ తెచ్చుకోవాలని సూచించింది. ఒకవేళ పర్మిషన్ పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది.
కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధిలోకి చేర్చింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో గెజిట్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడ్డాయి. వీటి పరిధిని కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంది. దీనిపై పలు దఫాలు చర్చలు కూడా జరిగాయి. కేంద్రానికి బోర్డులు ముసాయిదా కూడా సమర్పించాయి. ఐతే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకుండా పరిధి ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది తెలంగాణ. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ తీర్పు తర్వాత పరిధి నిర్ణయించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం బచావత్ ట్రైబ్యూనల్ ప్రకారం 811 టీఎంసీల వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరింది. దీనిపై చివరిసారిగా గతేడాది అక్టోబర్ లో కేంద్ర జల్ శక్తి మంత్రి ఛైర్మన్ గా, ఇద్దరు సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ లో చర్చ జరిగింది. ఇద్దరు సీఎంల అభిప్రాయం తర్వాత, బోర్డుల పరిధిపై తామే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకటించారు. దీంతో తాజా గెజిట్ విడుదల చేశారు. బోర్డు ఛైర్మన్, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లుగా తెలంగాణ,ఏపీకి చెందిన వారు ఉండకూడదని గెజిట్ లో పేర్కొన్నారు.
గోదావరి బేసిన్ లో ఉమ్మడి ప్రాజెక్టులు లేవు. ట్రిబ్యూనల్ కేటాయించిన నీటి వాటాయే పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. దీంతో గోదావరి ప్రాజెక్టులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కృష్ణా బేసిన్ లో మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ నిర్వహణలో ఉండగా...నాగార్జున సాగర్ తెలంగాణ నిర్వహణలో ఉన్నాయి. ఇవన్ని ఇక బోర్డుల పరిధిలోకి రానున్నాయి. ప్రాజెక్టుల హెడ్ వర్కులు, బ్యారేజులు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్ నిర్మాణాలు, కెనాల్ నెట్ వర్క్స్ , ట్రాన్స్ మిషన్ లైన్లు కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయని జల్ శక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుత్ ఉత్పత్తి బోర్డే పర్యవేక్షించనుంది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ అవార్డు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల అమలును బోర్డే చూస్తుంది. నోటిఫికేషన్ లోని షెడ్యూల్ 2 లో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం కృష్ణా బోర్డుకు ఉంటుంది. పర్మిషన్ లేని ప్రాజెక్టులను నోటిఫికేషన్ లో పెట్టినంత మాత్రాన వాటికి అనుమతులు ఇచ్చినట్లు కాదని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ఏపీ, తెలంగాణ రెండూ చూసుకోవాలని తెలిపింది.
కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు
- శ్రీశైలంపై ఏపీ ప్రభుత్వ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రైట్పవర్హౌస్, హంద్రీనీవా, ముచ్చుమర్రి, వెలిగొండ ప్రాజెక్టులు, తెలంగాణ పరిధిలోని కల్వకుర్తి లిఫ్ట్, లెఫ్ట్ పవర్హౌస్, పాలమూరు -రంగారెడ్డి, డిండి లిఫ్టులు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులు, నాగార్జునసాగర్పై ఏపీ పరిధిలోని కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, తెలంగాణ పరిధిలోని ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, పవర్ స్టేషన్, ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీ, వరద కాలువ, హైదరాబాద్ డ్రికింగ్ వాటర్ ప్రాజెక్టు.
- తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు, పవర్ హౌస్, కుడి, ఎడమ కాలువలు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు
- తుంగభద్ర నదిపై ఏపీ పరిధిలోని హైలెవల్, లోలెవల్ కాలువలు, కేసీ కెనాల్, తెలంగాణ పరిధిలోని ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం
- పులిచింతల ప్రాజెక్టు కింద ఏపీ పరిధిలోని స్పిల్ వే, తెలంగాణ పరిధిలోని పవర్ హౌస్.. ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టా కాలువలు
- మీడియం ఇరిగేషన్ కింద ఏపీలోని బైరవానితిప్ప ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టు, తెలంగాణలోని భక్తరామదాసు ఎత్తిపోతలు, డిండి లిఫ్ట్, మూసీ ప్రాజెక్టు,
పాలేరు రిజర్వాయర్, ఇతర ప్రాజెక్టులు
ఈ ప్రాజెక్టులకు వచ్చే ఇన్ ఫ్లో, వివిధ ఔట్లెట్లు, గేట్ల ద్వారా విడుదల చేసే ఔట్ఫ్లో ను బోర్డే మానిటరింగ్ చేయనుంది. ప్రాజెక్టుల ఆపరేషన్స్, మెయింటనెన్స్కు నిధులు రాష్ట్రాలే చెల్లించాలి. బోర్డు పరిధి నోటిఫై అయ్యాక కేఆర్ఎంబీలో 328 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేశారు. వీరిలో 95 శాతం మంది సిబ్బందిని రెండు రాష్ట్రాలు డెప్యూటేషన్పై నియమించాల్సి ఉంటుంది. ఇప్పుడు బోర్డు నిర్వహణ వ్యయం రూ.3 కోట్లు కాగా, ఇకపై రూ.100 కోట్లకు పెరగనుంది.
తాత్కాలిక కేటాయింపుల మేరకే...
కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలిక పద్ధతిని పంపకాలు చేసుకున్నారు. కృష్ణా నీళ్ల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల వారీగా పంపకాలు తేలేవరకు తాత్కాలిక కోటా ఆధారంగానే నీటి వినియోగానికి అనుమతించనున్నారు.
గోదావరి పరిధిలోకి వచ్చేవి..
గోదావరి బోర్డు ఆధీనంలోకి సింగూరు నుంచి దవళేశ్వరం వరకు అన్ని ప్రాజెక్టులు రానున్నాయి. తెలంగాణలోని సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, మిడ్మానేరు, కాళేశ్వరం, తుపాకులగూడెం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలు సహా ఇతర అన్ని ప్రాజెక్టులన్నీ బోర్డు పర్యవేక్షణ కిందికి రానున్నాయి. ఏపీలోని పోలవరం, పట్టిసీమ, తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకనగరం, చాగల్నాడు, చింతలపూడి, తాడిపూడి, పుష్కర ఎత్తిపోతలు, గోదావరి డెల్టా కాలువలు బోర్డు అధీనంలోకి రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 1,430 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసే వరకు సీడబ్ల్యూసీ పర్మిషన్ ఇచ్చిన నీటి కోటా మేరకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.