
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఎనిమిది బ్యాండ్లలో స్పెక్ట్రమ్ వేలాన్ని ప్రారంభిస్తోంది. దీని విలువ రూ. 96,000 కోట్లు కాగా, టెలికం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పోటీపడుతున్నాయి. వీటితో 5జీ మొబైల్ సేవలు అందించవచ్చు. చివరి స్పెక్ట్రమ్ వేలం ఆగస్ట్ 2022లో జరిగింది. 800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1,800 మెగాహెర్ట్జ్, 2,100 మెగాహెర్ట్జ్, 2,300 మెగాహెర్ట్జ్, 2,500 మెగాహెర్ట్జ్, 3,300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లలో అందుబాటులో ఉన్న అన్ని స్పెక్ట్రమ్లను వేలం వేస్తారు.
స్పెక్ట్రమ్ వేలం కోసం రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్లను డిపాజిట్ చేసింది. ఎయిర్టెల్ రూ. 1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ. 300 కోట్ల సీరియస్ మనీ డిపాజిట్ సమర్పించాయి. జియో ఈఎండీ ఆధారంగా మొత్తం స్పెక్ట్రమ్ విలువలో 37.36 శాతం, భారతి 13.07 శాతం, వొడాఫోన్ ఐడియా 3.73 శాతం కోసం బిడ్ వేయవచ్చని తెలుస్తోంది.