వెలుగు బిజినెస్ డెస్క్: ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఆ కంపెనీలకు రూ. 5 వేల కోట్ల క్యాపిటల్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నెల రోజులలోపే ఈ ప్రకటన వెలువడుతుందని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. ప్రభుత్వ రంగంలో నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీలుంటే, అందులో మూడు కంపెనీలు నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. ఆ కంపెనీలకు నష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఏ పోర్ట్ఫోలియోల వల్ల వస్తున్నాయి, క్లెయిమ్ మేనేజ్మెంట్ ఎలా మెరుగుపరచాలనే అంశాలపై తాజా ప్లాన్ ఫోకస్ పెడుతుందని ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు. వ్యాపారం కోసం నాలుగు ప్రభుత్వ కంపెనీలు ఒక దానితో ఒకటి పోటీపడి రేట్లు తగ్గించకుండా చర్యలు తీసుకోనున్నట్లు కూడా పేర్కొన్నారు.నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ. 4,950 కోట్ల క్యాపిటల్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఈ నెల మొదట్లోనే మూడో సప్లిమెంటరీ డిమాండ్లో ఈ ప్రపోజల్ పెట్టారు.
ఏ కంపెనీ ఎలా ఉంది....
ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి 9 నెలల్లో ఓరియెంటల్ ఇన్సూరెన్స్ రూ. 1,983 కోట్లు, నేషనల్ ఇన్సూరెన్స్ రూ. 679 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ రూ. 1,194 కోట్ల నష్టాలను పొందాయి. మరోవైపు న్యూ ఇండియా ఎష్యూరెన్స్ ఒక్కటే లాభాలు చూస్తోంది. ఈ కంపెనీ ఈ ఫైనాన్షియల్ మొదటి 9 నెలల్లో రూ. 700 కోట్ల లాభం ఆర్జించింది. దీంతో ఈ కంపెనీకి ప్రభుత్వం క్యాపిటల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐఆర్డీఏఐ రూల్స్ ప్రకారం ఉండాల్సిన సాల్వెన్సీ రేషియోలోనూ న్యూ ఇండియా ఎష్యూరెన్స్ఒక్కటే ముందుంది. మిగిలిన మూడు కంపెనీల రేషియో నిబంధనల కంటే తక్కువగానే ఉంది.
మెర్జర్ ప్లాన్....
నిజానికి నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో మూడింటిని మెర్జర్ చేయాలనుకుంటున్నట్లు 2018–19లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓరియెంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కంపెనీలను విలీనం చేసి, ఆ కొత్త సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకున్నది. ఈ కంపెనీల నష్టాలు పెరగడంతో ఆగిపోయింది. నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకదానిని ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. న్యూ ఇండియా ఎష్యూరెన్స్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయింది. యునైటెడ్ ఇండియాను ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం.