న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో దేశ ఫిస్కల్ డెఫిసిట్ రూ.4.51 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. ఇది ప్రభుత్వం వేసిన యాన్యువల్ టార్గెట్ (రూ.17.87 లక్షల కోట్లలో) 25.3 శాతానికి సమానం. కిందటేడాది ఇదే టైమ్లో ఈ నెంబర్ 21.2 శాతంగా నమోదయ్యింది. జూన్ క్వార్టర్లో ప్రభుత్వానికి రూ.5.99 లక్షల కోట్ల ఆదాయం రాగా, ఖర్చులు మాత్రం రూ.10.51 లక్షల కోట్లకు పెరిగాయి. జూన్ క్వార్టర్లో వచ్చిన ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 22.1 శాతానికి, ఖర్చులు 23.3 శాతానికి సమానం. కాగా, కిందటి ఆర్థిక సంవత్సరంలో దేశ ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 6.4 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది.
కీలక సెక్టార్లలో తగ్గిన గ్రోత్..
కిందటేడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో కీలక సెక్టార్లలో ప్రొడక్షన్ 8.2 శాతానికి తగ్గింది. క్రూడాయిల్, నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గడమే ఇందుకు కారణం. కిందటేడాది జూన్లో కోర్ సెక్టార్ల గ్రోత్ 13.1 శాతంగా రికార్డయ్యింది. స్టీల్, కోల్, సిమెంట్, రిఫైనరీ, నేచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ సెక్టార్లలో మాత్రం కిందటేడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో గ్రోత్ కనిపించింది. మరోవైపు జూన్లో కోర్ సెక్టార్ల గ్రోత్ ఐదు నెలల గరిష్టాన్ని తాకడం విశేషం.