
- బంగ్లాదేశ్కు కార్గో సర్వీసుల్ని అడ్డుకుంటోంది
- పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి
- బెంగాల్ సీఎస్కు లెటర్ రాసిన కేంద్ర హోం శాఖ సెక్రెటరీ
- ఇప్పటికే పలు అంశాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ సర్కార్ల మధ్య మరో వివాదం ఏర్పడింది. బంగ్లాదేశ్కు నిత్యావసరాలను పంపే కార్గో సర్వీసులను బెంగాల్ అడ్డుకుంటోందని కేంద్రం ఆరోపించింది. బెంగాల్ చర్యల వల్ల ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర, నిత్యావసర సేవలకు సంబంధించి కార్గో సర్వీసులు నాన్ స్టాప్గా నడవాలని చెబుతున్నా బెంగాల్ పట్టించుకోవడం లేదని విమర్శించింది. దీని వల్ల బంగ్లాదేశ్కు నిత్యావసర, అత్యవసర వస్తువులతో వెళుతున్న అనేక ట్రక్కులు బెంగాల్లో చిక్కుకుపోయాయని తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి తిరిగి వస్తున్న ట్రక్ డ్రైవర్లకు కూడా దేశంలోకి అనుమతించడం లేదని ఆరోపించింది. పొరుగు దేశాలతో ఉన్న ట్రేడ్ డీల్స్ కారణంగా సరిహద్దుల వెంబడి కార్గో సేవలను అడ్డుకోవడం ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి తగదని పేర్కొంది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రెటరీ అజయ్ భల్లా.. బెంగాల్ సీఎస్ రాజీవ్ సిన్హాకు బుధవారం ఓ లేఖ రాశారు. ఏప్రిల్ 24న జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఇండో–నేపాల్, ఇండో–బంగ్లాదేశ్, ఇండో–భూటాన్ మధ్య క్రాస్ బార్డర్ కార్గో సర్వీసులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఇంటర్నేషనల్ కార్గో సర్వీసులను అడ్డుకోవడం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఉల్లంఘించడమేనన్నారు.
ఇప్పటికే కేంద్ర జారీ చేసిన పలు గైడ్ లైన్స్ విషయంలో బెంగాల్, కేంద్రం మధ్య వివాదాలు నడుస్తున్నాయి. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు గురించి తెలుసుకునేందుకు వెళ్లిన సెంట్రల్ టీమ్.. బెంగాల్ సర్కార్పై విమర్శలు చేసింది. దేశంలోనే కరోనా మరణాల రేటు బెంగాల్లో ఎక్కువగా ఉందని, ఎక్కువ టెస్టులు చేయకపోవడం, సరైన సర్వయిలెన్స్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న రిపోర్ట్స్కు, రాష్ట్రం రిలీజ్ చేస్తున్న బులెటిన్లకు సంబంధం ఉండటం లేదని చెప్పింది. అయితే ఈ విమర్శలపై బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఘాటుగానే స్పందించారు. కేంద్రం తమకు సరైన కిట్లను సరఫరా చేయలేదని ఆరోపించారు. సెంట్రల్ టీమ్ ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో పొలిటికల్ వైరస్ను బెంగాల్లో స్ప్రెడ్ చేయడమేనని టీఎంసీ లీడర్ డెరిక్ ఒబ్రయన్ మండిపడ్డారు.