- బిల్లుకు పంజాబ్ అసెంబ్లీ ఆమోదం
చండీగఢ్: పంజాబ్లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మంగళవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించే బిల్లును పాస్ చేసింది. ఈమేరకు పంజాబ్ విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లు, 2023 స్వల్ప చర్చ తర్వాత ఆమోదం తెలిపింది. దీనికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూడా మద్దతు పలికాయి.
గత ఏడాది వైస్ చాన్స్లర్ల ఎంపికలో సీఎం భగవంత్ మాన్, గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఆప్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ బిల్లుపై చర్చ సమయంలో సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ కూడా గత ఏడాది ఇలాంటి బిల్లునే ఆమోదించిందన్నారు. "మేము ఒక యూనివర్సిటీకి వీసీని నియమించలేకపోతే, అది మమ్మల్ని గెలిపించిన ప్రజలకే అగౌరవం అని సీఎం మాన్ సభలో పేర్కొన్నారు.