
వాషింగ్టన్: ప్రముఖ సామాజిక కార్యకర్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చార్లీ కిర్క్ను దారుణంగా కాల్చిచంపిన హంతకుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చార్లీ కిర్క్ హత్య కేసులో రెండు రోజుల తర్వాత హంతకుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.
ట్రంప్ శుక్రవారం (సెప్టెంబర్ 12) ఫాక్స్ న్యూస్ 'ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్' షో సందర్భంగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘చార్లీ కిర్క్ను హత్య చేసిన నిందితుడిని పట్టుకున్నాం.. ఇప్పుడు హంతకుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. హంతకుడిని పట్టుకోవడంలో స్థానిక పోలీసులు, గవర్నర్, ఎఫ్బీఐ గొప్పగా పనిచేశారు’’ అని అన్నారు ట్రంప్.
2025, సెప్టెంబర్ 10న ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో దాదాపు 3,000 మంది ప్రేక్షకుల ముందు ప్రూవ్ మీ రాంగ్ అనే బహిరంగ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త చార్లీ కిర్క్ వేదికపై మాట్లాడుతుండగా గుర్తు తెలియని దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ చార్లీ కిర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసు దర్యాప్తును ఎఫ్బీఐ టేకప్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే హంతకుడిని అరెస్ట్ చేసింది. చార్లీ కిర్క్ను కాల్చి చంపిన హంతకుడు కాలేజ్ స్టూటెండ్ అని సమాచారం.
►ALSO READ | హోటల్కు నిప్పు పెట్టిన ఆందోళన కారులు.. నేపాల్లో భారత మహిళ మృతి.. 51 కి చేరిన మృతుల సంఖ్య
ఉన్నత పాఠశాల, కళాశాల క్యాంపస్లలో యువతలో సంప్రదాయవాద విలువలను పెంపొందించడానికి అంకితమైన ‘టర్నింగ్ పాయింట్ యూఎస్’ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్. గొప్ప సామాజిక వేత్తగా పేరు తెచ్చుకున్న కిర్క్ రిపబ్లికన్ పార్టీ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అతని కుటుంబంతో కిర్క్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన చార్లీ కిర్క్కు మరణానంతరం అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు ట్రంప్.