చవకగానే శాటిలైట్ నెట్ సేవలు.. మంత్లీ ప్లాన్​ ధర రూ. 840 లోపే..

చవకగానే శాటిలైట్ నెట్ సేవలు.. మంత్లీ ప్లాన్​ ధర రూ. 840 లోపే..

న్యూఢిల్లీ: మన దేశంలో శాటిలైట్​ ఇంటర్నెట్ సేవలు త్వరలో తక్కువ ధరలతోనే ప్రారంభం కానున్నాయి.  ఇవి నెలకు రూ. 840 కంటే తక్కువ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని నేషనల్​మీడియా రిపోర్ట్​ చేసింది. ముఖ్యంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ వంటి సంస్థలు భారతదేశ మార్కెట్లోకి వస్తుండటంతో పోటీ పెరిగి ధరల యుద్ధం మొదలవుతుందని భావిస్తున్నారు. 

శాటిలైట్ నెట్ ప్రొవైడర్లు తమ ప్రారంభ దశలో వినియోగదారులను ఆకర్షించడానికి నెలకు 10 డాలర్ల (సుమారు రూ.840) కంటే తక్కువ ధరకే అపరిమిత డేటా ప్లాన్‌‌‌‌‌‌‌‌లను అందించాలని భావిస్తున్నారు. మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో  కోటి మంది కస్టమర్లను చేరుకోవడమే వీళ్ల ప్రధాన లక్ష్యం. స్పెక్ట్రమ్​ కేటాయింపుల ఖర్చులను భర్తీ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సంపాదించుకోవడం అత్యవసరమని ఈ సంస్థలు చెబుతున్నాయి.

డాట్ నుంచి గ్రీన్ ​సిగ్నల్​
స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ ఇప్పటికే డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్​) నుంచి ప్రాథమిక అనుమతిని పొందింది. అయితే, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్​స్పేస్) నుంచి తుది ఆమోదం రాలేదు. యూటెల్​శాట్​, వన్‌‌‌‌‌‌‌‌వెబ్,  జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి ఇతర పోటీదారులు కూడా 2021,  2022లో తమ లైసెన్సులను పొందారు. అయితే ఇన్​స్పేస్ ఆమోదం కోసం దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ తన 7,000 శాటిలైట్లతో ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

భారతదేశంలో వేగవంతమైన వృద్ధికి తక్కువ బ్యాండ్‌‌‌‌‌‌‌‌విడ్త్ సమస్యగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఐఎఫ్​ఎల్​ రీసెర్చ్ ప్రకారం, స్టార్‌‌‌‌‌‌‌‌లింక్ శాటిలైట్​ సామర్థ్యంలో కేవలం 0.7శాతం నుంచి 0.8శాతం మాత్రమే భారతదేశానికి అందుబాటులో ఉంటుంది.  శాటిలైట్​ ఇంటర్నెట్ రేట్లు సంప్రదాయ బ్రాడ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్ సేవలతో పోలిస్తే 7 నుంచి 18 రెట్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్​ సేవలను  అందించడంలో ఇవి కీలకమని నిపుణులు చెబుతున్నారు.