బిజినెస్ డెస్క్, వెలుగు: ఫేషియల్రికగ్నిషన్ టెక్నాలజీ సాయంతో 64 లక్షల మోసపూరిత ఫోన్ కనెక్షన్లను ప్రభుత్వం గత ఆరు నెలల్లో కట్చేసింది. మోసపూరిత ఉద్దేశాలతో తీసుకున్న సిమ్కార్డులను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ అండ్ ఫేషియల్రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్ (ఏఎస్టీఆర్– ఇదొక టెక్నాలజీ టూల్)ను డిపార్ట్మెంట్ఆఫ్ టెలికం అందుబాటులోకి తెచ్చింది.
సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీ–డాట్) సాయంతో డాట్ ఈ టూల్ను డెవలప్ చేయగలిగింది. అనుమతించిన దానికంటే ఎక్కువ సిమ్ కార్డులు పొందేందుకు ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువసార్లు ప్రయత్నిస్తే, ఫొటో ఆధారంగా అలాంటి వ్యక్తులను ఈ టెక్నాలజీ టూల్ గుర్తిస్తుంది. ఒక వ్యక్తి తన ఆధార్కార్డుతో 9 సిమ్ కార్డులను మాత్రమే తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. కానీ, కొన్ని సందర్భాలలో ఒకే వ్యక్తి తన ఆధార్కార్డుతో వందలలో కాదు ఏకంగా వేల సంఖ్యలోనే సిమ్ కార్డులను తీసుకున్నట్లు సీ–డాట్ సొల్యూషన్ ఏఎస్టీఆర్ కనుక్కుంది. కొవిడ్–19 తర్వాత కాలంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకం అటు గవర్నమెంటు, ఇటు ప్రైవేటు సంస్థలలోనూ బాగా పెరిగింది.
సరైన డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్లు అందుబాటులో లేకపోవడంతో ఈ వాడకం కొన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. పెద్ద పెద్ద డేట్బేస్ల ప్రాసెసింగ్కు తగిన మెకానిజం తేలేకపోవడమూ ఒక సవాలుగా మారింది. ఆగస్టు 2023 లో ఆమోదం పొందిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ దేశంలో అమలులోకి తేవాల్సి ఉంది. ఎవరైనా వ్యక్తి అనుమతికి మించి కనెక్షన్లు తీసుకున్నారా అనే అంశాన్ని ఫేషియల్ రికగ్నిషన్ అల్గారిథమ్ కనుగొంటుంది. ఫోన్ రిజిస్ట్రేషన్ డేటాబేస్తో సరిపోల్చడం ద్వారా ఆ సొల్యూషన్ పనిచేస్తుంది.
దేశంలోని 140 కోట్ల మందితో కూడిన పూర్తి డేటా బేస్ను ఇందుకోసం వినియోగిస్తున్నట్లు సీ–డాట్ సీఈఓ రాజ్కుమార్ ఉపాధ్యాయ్ చెప్పారు. ఇదొక క్లిష్టమైన ప్రక్రియేనని, ఇంతదాకా ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద డేటాబేస్ను ఒకేసారి ప్రాసెస్ చేస్తున్న దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు ఎక్కువ సిమ్ కార్డులు పొందేందుకు రిజిస్ట్రేషన్ సమయంలో తమ మొహాన్ని దాచుకునే ప్రయత్నాలను చేసినట్లు ఉపాధ్యాయ్ వివరించారు. అయితే, అలా మొహాన్ని దాచుకుని ప్రయత్నించే వ్యక్తులను సైతం వారి ఫొటోలలోని పోలికల ద్వారా గుర్తించగలుగుతున్నామని వెల్లడించారు. దీనిని ఫేషియల్ వెక్టర్గా వ్యవహరిస్తారని, ప్రతి వ్యక్తికి యూనిక్ ఫేషియల్ వెక్టార్ ఉంటుందని చెప్పారు.
తన మొహాన్ని తెలియకుండా దాచుకునే ప్రయత్నం చేసినా, ఆ వ్యక్తి పెదవులు, కళ్లు వంటి వెక్టార్లు మారవని వివరించారు. ఇదే తరహా ఫేషియల్ వెక్టార్ ఉండే వ్యక్తులను తమ అల్గారిథమ్ గుర్తిస్తుందని, ఫలితంగా ఎక్కువ సిమ్లను తీసుకున్న వ్యక్తులు బయటపడతారని సీ–డాట్ సీఈఓ పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే తీసుకునే వీలుంది. కానీ, కొన్ని సందర్భాలలో ఆయా సిమ్లతో ఒకే వ్యక్తి ఫొటో 1,000– 2,000 సార్లు ఉండటాన్ని కనుక్కోగలిగామని వెల్లడించారు.
మోసాలు చేసేందుకే ఎక్కువ సిమ్కార్డులు..
సైబర్ మోసాలు చేసే ఉద్దేశంతోనే ఇలా ఎక్కువ సిమ్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఉపాధ్యాయ్ చెప్పారు. ఫేక్ కస్టమర్ ఏజంట్లుగా వ్యవహరిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో ఇలాంటి మోసాల సంఖ్య భారీగా పెరిగిపోయిందని అన్నారు. దేశంలో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న వారి సంఖ్య లక్షలలోకి చేరుకుందని వివరించారు. ఏఎస్టీఆర్ వాడి అలాంటి కేసులను గుర్తించాక టెలికం కంపెనీలకు ఆ వివరాలను తెలియచేస్తారు. అప్పుడు కేవైసీ రుజువులు ఇమ్మని ఆ వ్యక్తులకు నోటీసులు జారీ అవుతాయి.
60 రోజుల తర్వాత ఆ వ్యక్తుల నుంచి సరైన సమాధానం రాకపోతే, అధికారులు ఆ కనెక్షన్లను కట్ చేస్తారు. అంతేకాదు, బల్క్లో సిమ్ కార్డులను అలాంటి మోసపూరిత వ్యక్తులకు అమ్మే షాపులపైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి షాపుల వారి సాయం లేకుండా ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు పొందడం సులభమేమీ కాదని, అందుకే వారి పైనా చర్యలు తప్పవని ఉపాధ్యాయ్ అన్నారు.
మోసపూరిత సిమ్ల వాట్సాప్ ప్రొఫైల్సూ గమనిస్తున్నాం
మోసపూరితంగా తీసుకునే సిమ్కార్డులు, నెంబర్లను గుర్తించేందుకు ఆయా వాట్సాప్ ప్రొఫైల్స్ను కూడా చూస్తున్నట్లు సీ–డాట్ సీఈఓ రాజ్కుమార్ ఉపాధ్యాయ్ చెప్పారు. మోసాలు చేయడానికి తీసుకునే సిమ్ కార్డులను కొంత కాలం వాడిన తర్వాత కాల్చేస్తుండటాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. కానీ, మోసగాళ్లు ఆ తర్వాత కూడా వాట్సాప్ను డీ–యాక్టివేట్ చేయకుండా అదే ప్రొఫైల్తో కొనసాగుతుండటాన్ని కనుక్కున్నట్లు వివరించారు.
వాట్సాప్ రిజిస్ట్రేషన్కు ఒక్కసారి మాత్రమే సిమ్ కార్డు అవసరం ఉంటుందని ఉపాధ్యాయ్ ప్రస్తావించారు. 2023 మొదటి నుంచీ వాట్సాప్ ద్వారా స్కామర్లు లక్షల మంది అమాయకులకు వల వేస్తున్నారని, దీంతో వారి వాట్సాప్ ప్రొఫైల్స్ సైతం డీ–యాక్టివేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.