
ప్రజలకు న్యాయం చేసేందుకే భూ భారతి తెచ్చామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో భూభారతిపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి.. 18 రాష్ట్రాల్లో స్టడీ చేసి భూభారతి తెచ్చామన్నారు. నిజమైన పట్టాదారులు ఎవరో భూభారతితో తెలుస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ధరణిలో కబ్జాకాలం ఎత్తేసిందని.. సైడ్ డీల్ కోసమే ఆనాడు కేసీఆర్ కబ్జా కాలం ఎత్తేశారని ఆరోపించారు వివేక్.
డబుల్ బెడ్రూం ఇళ్లతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు ఎమ్మెల్యే వివేక్. ఏ ఊర్లోనైనా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు నిజమైన పేదవాళ్లేకే ఇస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తోందన్నారు. గ్రామ గ్రామానా మన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.