పాపం చిన్నారి.. తల్లిదండ్రులు దుబాయ్లో.. డెంగ్యూతో ఆరేళ్ల చిన్నారి మృతి

పాపం చిన్నారి.. తల్లిదండ్రులు దుబాయ్లో.. డెంగ్యూతో  ఆరేళ్ల చిన్నారి మృతి
  • డెంగ్యూతో చిన్నారి మృతి
  • ఉపాధి కోసం దుబాయ్​కు వలస వెళ్లిన తల్లిదండ్రులు
  • జగిత్యాలలో అమ్మమ్మతో కలిసి ఉంటున్న ఆద్యశ్రీ

జగిత్యాల టౌన్, వెలుగు: డెంగ్యూతో జగిత్యాల రూరల్  మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన ఆద్యశ్రీ(6) చనిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు గాడిపెల్లి శ్రీధర్, -అలేఖ్య దంపతులు ఉపాధి కోసం దుబాయ్ కు వెళ్లారు. 

వారి ఇద్దరు పిల్లల్లో ఒకరు నానమ్మ దగ్గర స్వగ్రామంలో ఉండగా, ఆద్యశ్రీ అమ్మమ్మతో జగిత్యాలలో ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ నెల 26న ఆద్యశ్రీకి జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆమెను మాతాశిశు కేంద్రంలో చేర్పించారు. 

వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించారు. జ్వరం తీవ్రత పెరిగి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్​ కావడంతో మంగళవారం ఉదయం చనిపోయింది. ఈ విషయం దుబాయ్ లో ఉన్న తల్లిదండ్రులకు తెలియజేయడంతో, వారు వీడియో కాల్  చేసి కూతురి డెడ్​బాడీ చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని.. 

మహబూబ్ నగర్ రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని మహబూబ్ నగర్  నగరంలోని తిరుమలహిల్స్  సమీపంలో ఒకరు చనిపోయారు. ఎస్సై విజయ్ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన రంగాచారి(30) కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాడు. 

మంగళవారం రంగాచారి బైక్​పై జడ్చర్లకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా, తిరుమలహిల్స్  సమీపంలోకి రాగానే ఆర్టీసీ బైక్​ను వెనక నుంచి ఢీకొట్టింది. తీవ్రగాయాలై రంగాచారి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.