ఎల్ఏసీ దగ్గర చైనా బలగాలు
బయటపెట్టిన అమెరికా… డ్రాగన్ చర్యపై తీవ్ర ఆగ్రహం
వాషింగ్టన్/ న్యూఢిల్లీ: ఇండియా – చైనా బార్డర్ ఏరియా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) దగ్గర డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంపై అమెరికా సీరియస్ అయింది. కొన్ని రోజుల నుంచి చైనా ఎల్ఏసీకి ఉత్తర దిక్కుగా భారీగా బలగాలను మోహరిస్తోందని ఆ దేశ ఫారెన్ మినిస్టర్ మైక్ పాంపియో చెప్పారు. ఈ తరహా చర్యలు మంచివి కావని సూచించారు. నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి పనులకు పాల్పడుతాయని ఆయన విమర్శించారు. “ఈ రోజు కూడా ఎల్ఏసీ దగ్గర ఇండియా బార్డర్ కు నార్త్ వైపు చైనా బలగాలను భారీగా మోహరించటం మేము గమనించాం” అని పాంపియో అన్నారు. లడఖ్, నార్త్ సిక్కింలోని ఎల్ఏసీ దగ్గర రెండు వారాలుగా ఇండియా -చైనా మధ్య టెన్షన్స్ నెలకొన్నాయి. ఇప్పటికీ రెండు దేశాలు బార్డర్ దగ్గర బలగాలను మోహరిస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మనదేశానికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. కరోనా వైరస్, హాంకాంగ్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరును అమెరికా తప్పుబట్టింది. ఇది చైనా కమ్యూనిస్ట్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ కు నిదర్శనమని ఆరోపించింది. కరోనా విషయంలో నిజాలను దాచిందని, హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను నాశనం చేసే చర్యలను మొదలు పెట్టిందని పాంపియో చైనాను విమర్శించారు. ఈమధ్యనే డ్రాగన్ చేపట్టిన చర్యలను ఉద్దేశించి వాట్స్ ద హెల్ ఇజ్ గోయింగ్ ఆన్ అంటూ పాంపియో తీవ్రమైన కామెంట్స్ చేశారు. సౌత్ చైనా సముద్రంలో పట్టుకోసం మేధో సంపత్తిని దొంగిలించేందుకు చైనా నిరంతరం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా ఆర్మీ నేవీని ఇతర దేశాల్లోనూ మోహరించేందుకు ఆయా దేశాల్లో పోర్టుల్ని నిర్మించటాన్ని తాము గమనిస్తూనే ఉన్నామని పాంపియో చెప్పారు.
చర్చలతో సమస్యకు పరిష్కారం
ఇండియా – చైనా ఎల్ఏసీ దగ్గర టెన్షన్లు నెలకొన్నప్పటికీ పలుచోట్ల రెండు దేశాలు బలగాలను తగ్గించాయి. దీంతో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఇదో సానుకూల సంకేతమని భావిస్తున్నారు. లడఖ్, నార్త్ సిక్కిం దగ్గర నెలకొన్న టెన్షన్స్ను చర్చల ద్వారా పరిష్కరించేందుకు రెండు దేశాల విదేశాంగ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉద్రిక్తతల ద్వారా సాధించేదేమీ లేదని మాట్లాడుకోవటం ద్వారానే సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
For More News..