రిసార్టే మిలటరీ బేస్

రిసార్టే మిలటరీ బేస్

కంబోడియాలో నిర్మించిన చైనా

నేవీ నౌకలు, ఆర్మీ విమానాల

రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు

5 కిలోమీటర్ల పొడవున

భారీ కంటైనర్ టర్మినల్

సెంటీమీటర్ చనువిస్తే, కిలోమీటర్ దూసుకెళ్తావు కదరా నువ్వు.. ఓ తెలుగు సినిమాలో ఫేమస్ హీరో చెప్పే డైలాగ్ ఇది. విదేశీ భూభాగాల్లో తల దూర్చే చైనాకు ఈ డైలాగ్ కరెక్టుగా సరిపోతుంది. సాయం పేరుతో పేద దేశాలకు ముందుగా అప్పులిస్తుంది. అక్కడ ఎయిర్​పోర్టులు, పోర్టులు లీజుకు తీసుకుంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల్లో ఇదే చేసింది. చేస్తోంది. విదేశీ భూభాగాలంటే బాగా మోజు. సరిహద్దులను ఆక్రమించుకుంటూ పోతుంది. ఇంకా ఆశ చావక, సముద్రాల్లో కృత్రిమ దీవులు కూడా కడుతోంది. ఇప్పుడు దాని కన్ను కంబోడియాపై పడింది. అక్కడ రిసార్టు పేరుతో మిలటరీ బేస్ కట్టిందని, రిసార్టును రాత్రికి రాత్రి ఆర్మీ బేస్​గా మార్చొచ్చని తాజాగా రిపోర్టులు వస్తున్నాయి.

ఏడాదికి రూ.7 కోట్లు.. 40 ఏళ్లు

కంబోడియాలోని కో కాంగ్ ప్రావిన్స్​లో తీరం వెంబడి పెద్ద మొత్తంలో భూభాగాన్ని చైనా లీజుకు తీసుకుంది. అది సుమారు 1.11 లక్షల ఎకరాలు. ఆ దేశ తీరంలో ఇది 20 శాతం. ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున 40 ఏళ్లకు అద్దెకు తీసుకుంది. ఈ ప్రాజెక్టును చైనాకు చెందిన యూడీజీ కంపెనీ చేపట్టింది. దానికి ‘దారా సకోర్ సీ షోర్ రిసార్ట్ లాంగ్ టర్మ్ ప్రాజెక్టు’ అని పేరు పెట్టింది.

టూరిజం అవసరాలకు మించి..

దారా సకోర్ రిసార్టును టూరిజం అవసరాలకు మించి యూడీజీ కట్టింది. ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నట్లు చెప్పుకునేందుకు, ఎడాపెడా సబ్సిడీలిస్తోంది. టూరిస్టు బోట్లు, చిన్నపాటి నౌకల కోసం నీటిపై వంతెనలు కట్టినట్లుగా శాటిలైట్ ఇమేజెస్​లో కనిపిస్తోంది. ప్రధాన బిల్డింగ్​కు ఎదురుగా ‘18 హోల్ గల్ఫ్ కోర్స్’ను కట్టారు.

అలాగే ప్రస్తుతం ‘డీప్ సీ పోర్టు’ను కూడా కడుతున్నారు. ఇందులో భారీ కంటైనర్ టర్మినల్ కూడా ఉండబోతోంది. సుమారు 5 కిలోమీటర్ల పొడవున ఈ టెర్మినల్ ఉంటుందని అంచనా. చైనీయులు ఇప్పుడు అక్కడ పనులు చేస్తున్నారు.

డారా రిసార్టు వద్ద మరో పోర్టు

దారా రిసార్టుకు 10 కిలోమీటర్ల దూరంలో మరో గుర్తు తెలియని చిన్న పోర్టును చైనా నిర్మిస్తోంది. అక్కడ బిల్డింగుల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వంతెన కూడా నిర్మించారు. నేవల్ షిప్పులతో సహా అన్ని రకాల నౌకలు నిలిపేందుకు వీలుగా ఇక్కడ కన్​స్ట్రక్షన్ జరుగుతోంది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టును భారీగా నిర్మిస్తోంది. ఇక్కడ సివిల్ ఎయిర్​క్రాఫ్టులతోపాటు, మిలటరీ యుద్ధ విమానాలు కూడా దిగేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన రిసార్టు బిల్డింగ్​కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎయిర్​పోర్టు ఉంది.

అమెరికా ఆందోళన

చైనా, కంబోడియా మధ్య మిలటరీ కో ఆప-రేషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనాకు అప్పగిం చిన భూభాగాన్ని మిలటరీ అవసరాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని అంటోంది. ఇదే విషయాన్ని కంబోడియా ప్రధాని హున్సేన్ కు రాసిన లేఖలో అమెరికా వైస్ ప్రెసిడెంట మెక్ పెన్స్ తెలియజేశారు. దీన్ని నిజం చేస్తూ కిరి సకోర్ లో చైనా నేవల్ బేస్ ఏర్పాటుకు హున్ సేన్ అనుమతించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం సీనియర్ కంబోడియన్ అధికారుల ద్వారా తెలిసిందని థాయ్ ల్యాండ్ లోని నరేసువాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పైల్ చాంబర్స్ చెప్పారు . అయితే తమ దేశంలో విదేశీ దళాలేవీ లేవని హున్సేన్ స్పష్టం చేశారు. అక్కడ కట్టిన రిసార్టును మిలటరీ బేస్ గా మార్చే అవకాశాలున్నాయి.