అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబరు 9న భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్ లో చైనా దూకుడు పెంచింది. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే వైమానిక స్థావరాలను యాక్టివేట్ చేసింది. టిబెట్లోని బాంగ్డా, లాసా, షిగాత్సే ప్రాంతాల్లో ఉన్న తన వైమానిక స్థావరాలను అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలతో నింపుతోంది. ఇది వాస్తవమేనంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. టిబెట్ లోని బాంగ్డా, లాసా, షిగాత్సే వైమానిక స్థావరాలలో పెద్ద సంఖ్యలో ‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ రకం డ్రోన్లు, ‘సుఖోయ్ ఎస్యూ 27’ రకం యుద్ధ విమానాలను చైనా మోహరించిందని నిర్ధారించే పలు శాటిలైట్ దృశ్యాలతో తాజాగా కథనాలను ప్రచురించాయి. ఆ ఉపగ్రహ చిత్రాలు డిసెంబరు 14 నాటివని కథనంలో పేర్కొన్నాయి.
చైనా విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు..
ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ లోని భారత గగన తలంలో చైనా విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు భారత సైన్యం కంటపడ్డాయి. ఈ తరుణంలో టిబెట్ లోని ఎయిర్ బేస్ లలో చైనా ఆయుధ సంపత్తి మోహరించిందనే వార్తలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలతో నిండుగా ఉన్న టిబెట్ లోని బాంగ్డా ఎయిర్ బేస్ భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. టిబెట్ లోని షిగాత్సే ఎయిర్ బేస్ నుంచి మన దేశంలోని సిక్కిం సరిహద్దు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. టిబెట్ లోని లాసా ఎయిర్ బేస్ నుంచి ఇండియా బార్డర్ 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. లాసాలో ఉన్న ఎయిర్ బేస్ విస్తరణ పనులను చైనా ప్రారంభించినట్లు శాటిలైట్ ఫొటోలను బట్టి తెలుస్తోంది. అక్కడ రెండో విమాన రన్ వేను చైనా నిర్మిస్తున్నట్లు సమాచారం.
‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ ఎందుకంటే..
బాంగ్డా, లాసా, షిగాత్సే వైమానిక స్థావరాలలో చైనా సిద్ధంగా ఉంచిన డ్రోన్ల జాబితాలో ‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ అనే అత్యాధునిక డ్రోన్లు కూడా ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. నిర్విరామంగా గగనతలంలో 10 గంటల పాటు పహారా కాస్తూ ఎగరగల సామర్థ్యం ‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ కు ఉంది. ఈ డ్రోన్ నిర్దేశిత ప్రదేశాల గగన తలంలో తిరుగుతూ అక్కడి మ్యాపింగ్, ఇమేజెస్ ను సైనిక స్థావరానికి చేరవేస్తుంది. ఇది పంపించే మ్యాపింగ్, ఇమేజెస్ ఆధారంగా.. లక్ష్యం ఎంత దూరంలో ఉందనే దానిపై ఒక స్పష్టతతో సైన్యం క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇక బార్డర్ లో చైనా మోహరించిన ‘సుఖోయ్ ఎస్యూ 27’ యుద్ధ విమానాల డిజైనింగ్ కు మూలం రష్యాకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ ఫైటర్ జెట్. దీనిలో పలు మార్పులు, చేర్పులు చేసి చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యుద్ధ విమానమే ‘సుఖోయ్ ఎస్యూ 27’.
ఇండియా సైతం అప్రమత్తం..
ఇక డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద చైనా సైనికులు ఘర్షణకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. డిసెంబరు 15 నుంచి 16 వరకు రెండు రోజుల పాటు దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలను నిర్వహించింది. ఈ ఎక్సర్ సైజ్లో రాఫెల్, సుఖోయ్ 30ఎంకేఐ ఫైటర్ జెట్ లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగించారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనా సోల్జర్లకు, మన సోల్జర్లకు మధ్య జరిగిన గొడవకు.. ఈ ఎక్సర్సైజ్కు సంబంధం లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇది అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ లలో ఈ ఎక్సర్ సైజ్ జరిగిందని వెల్లడించింది.