నేషనల్ డే పరేడ్లో ప్రదర్శించనున్న డ్రాగన్ కంట్రీ
పీఎల్ఏ.. పూర్తిగా చెప్పాలంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. చైనా సైనిక బలగమిది. ప్రపంచంలోనే అతిపెద్దది. అలాంటి ఆ ఆర్మీ అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన ఆయుధాలూ ఉన్నాయి. మరిన్ని ఆయుధాలు రాబోతున్నాయి. తన అమ్ములపొదిలోని ఆ అస్త్రాలన్నింటినీ ప్రపంచానికి చూపించబోతోంది డ్రాగన్ కంట్రీ. అక్టోబర్ 1న చైనా నేషనల్ డే. బీజింగ్లో నిర్వహించే సంబురాల్లో వాటన్నింటినీ ప్రదర్శించబోతోంది. దాదాపు 15 వేల మంది ఆర్మీ సిబ్బందితో పరేడ్ చేయించబోతోంది. 160 యుద్ధవిమానాలు, 580 రకాల ఆయుధాలను ప్రపంచ దేశాలకు చూపించి తమ సత్తా ఏపాటిదో చూపించుకునేందుకు ఆ దేశం రెడీ అవుతోంది. ఒక్కసారి ఆ ఆయుధాల్లో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం. |
జేఎల్ 2 సబ్మెరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్
చైనా జిన్ క్లాస్ అణు సామర్థ్య బాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్లకు ఈ జేఎల్ 2 సబ్మెరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ (ఎస్ఎల్బీఎం)లే చాలా కీలకం. ప్రస్తుతం నాలుగు సబ్మెరీన్లు సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి. మరో రెండింటిని అభివృద్ధి చేస్తోంది. ఒక్కో సబ్మెరీన్లో 12 జేఎల్ 2 (సింగిల్ వార్హెడ్) మిసైళ్లు ఉంటాయి. 7,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను జేఎల్2 ఛేదించగలదు. చైనా తీర ప్రాంతాల నుంచి ఇండియా, అలస్కాలను ఈ మిసైళ్లతో చైనా ఈజీగా టార్గెట్ చేయగలదు. దాని కన్నా మరింత పవర్ఫుల్ అయిన జేఎల్3 మిసైల్ను గత ఏడాది చివర్లో చైనా టెస్ట్ చేసిందని సమాచారం. అదింకా తయారీ దశలోనే ఉంది.
టీ 99 ట్యాంక్.. లీడర్
టైప్ 99, టైప్ 15 యుద్ధ ట్యాంకులను ఇటీవలి రీహార్సల్స్ చైనా చూపించింది. ఎడారి ప్రాంతాల్లో శత్రువుల కన్నుగప్పుతూ టైప్ 99 యుద్ధ ట్యాంకులు ముందుకెళ్లిపోతాయట. చైనా యుద్ధ ట్యాంకులకు ఇదే లీడర్. దాంతో పాటు టైప్ 15 లైట్ ట్యాంకులనూ పరేడ్లో ప్రదర్శించనుంది చైనా. వాటితో పాటు టైప్–04 ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్ (ఐఎఫ్వీ), టైప్05 ఆంఫిబియస్ ఐఎఫ్వీలనూ ప్రదర్శించనుంది. వాటి వివరాలేవీ బయటి ప్రపంచానికి ఇంకా తెలియదు. ఇవే కాదు, మరిన్ని శక్తిమంతమైన తన ఆయుధాలను బయటి ప్రపంచానికి చూపించి తన బలాన్ని నిరూపించుకోవాలని ఆ దేశం తహతహలాడుతోంది.
హెచ్–6ఎన్ బాంబర్.. లాంగ్రేంజ్కు పెద్దన్న
చైనా ఎయిర్ఫోర్స్ ఫ్లీట్కు ప్రధాన బలం ఇది. లాంగ్ రేంజ్ బాంబర్లకు పెద్దన్న ఈ హెచ్–6ఎన్ యుద్ధ విమానం. డీఎఫ్–21 నౌకా విధ్వంసక క్షిపణులను ఇది మోసుకెళుతుంది. హెచ్–6కేకి ఇది అడ్వాన్స్డ్ మోడల్. గాల్లోనే ఇంధనం నింపుకునేలా అదనపు శక్తిని దీనికిచ్చింది చైనా.
డీఆర్8 డ్రోన్.. స్లిమ్గా, సౌండ్కన్నా స్పీడ్గా
చాలా స్లిమ్గా ఉంటుందట ఈ డ్రోన్. సౌండు కన్నా ఐదు రెట్ల వేగంతో గాల్లో దూసుకెళ్లే శక్తి దీని సొంతం. శత్రు దేశాల యుద్ధ విమానాల దగ్గరకెళ్లి దాని వివరాలను, మిసైల్ లాంచర్లకు చేరవేయడం దీని పని.
నీళ్లలోపల పని పట్టేస్తది
దాని పేరేంటో ఇంకా తెలియనప్పటికీ.. ఇటీవలి రీహార్సల్స్లో అది కనిపించింది. డ్రోన్ సబ్మెరీన్గా దాన్ని పిలుస్తున్నారు. దాని పనేంటో మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు. దాని వివరాలను అంత గుట్టుగా ఉంచింది డ్రాగన్ దేశం. ఇలాంటి అన్మ్యాన్డ్ అండర్వాటర్ వెహికిల్స్ (యూయూవీ)లను డెవలప్ చేయడానికి చైనా 15 రీసెర్చ్ టీంలను ఏర్పాటు చేసిందని సమాచారం.
డీఎల్17.. తక్కువ ఎత్తులో, అమిత వేగంతో
హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్ (హెచ్జీవీ)కి ఇది బెస్ట్ ఉదాహరణ. ఓ మిసైల్ రాకెట్ నుంచి దీన్ని ఈజీగా లాంచ్ చేయొచ్చు. ఇది ఓ ఎత్తుకు చేరుకున్నాక బూస్టర్ రాకెట్ హెచ్జీవీని బలంగా ముందుకు నెడుతుంది. అక్కడి నుంచి హెచ్జీవీ మిసైల్ పేలోడ్ను టార్గెట్ దగ్గరకు తీసుకెళుతుంది. ఈ మిసైళ్లు చాలా తక్కువ ఎత్తులో గంటకు 6,115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. తద్వారా శత్రు దేశాల రాడార్ కంట పడకుండా అది తప్పించుకోగలుగుతుంది. 2014 నుంచి చైనా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. 2020లో దానిని ఆర్మీలోకి తీసుకునే అవకాశం ఉంది. అటు న్యూక్లియర్, ఇటు సంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లే సత్తా దీని సొంతం.
కత్తిలాంటి డ్రోన్
గబ్బిలంలా ఉంటుంది. కత్తిలా పదునుగా శత్రువు మీదకు దూసుకెళుతుంది. శత్రువుల కంట పడకుండా పని కానిచ్చేస్తుంది. విమానాలపైకి బాంబులను వదులుతుంది. 2013లో దీనిని చైనా తొలిసారిగా టెస్ట్ చేసింది. అయితే, ఆ డ్రోన్లో వాడే వార్హెడ్లపై మాత్రం ఇంకా సస్పెన్స్ ఉంది.
డీఎఫ్ 41 మిసైల్.. భూమ్మీదే అత్యంత పవర్ఫుల్
పరేడ్ మొత్తంలో ఈ మిసైల్పైనే అందరి దృష్టీ ఉంది. ఎందుకంటే ఇది ఖండాంతర క్షిపణి. అంటే, ఖండాల అవతల ఉన్న లక్ష్యాలను ఛేదించే సత్తా దీని సొంతం. 15 వేల కిలోమీటర్ల రేంజ్ దీని సొంతం. పీఎల్ఏ రాకెట్ ఫోర్సెస్కు ఇదే ప్రధాన అస్త్రం. అంతేకాదు, భూమ్మీదే అత్యంత శక్తిమంతమైన మిసైల్ అట ఇది. ప్రపంచంలోని ఏ దేశానికీ అంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిసైళ్లు లేవు. ఆయుధాల పరంగా టాప్లో ఉండే అమెరికాకూ అలాంటి ఆయుధం లేదంటే నమ్మలేరేమో. చైనా నుంచి దీన్ని ప్రయోగిస్తే అమెరికాను జస్ట్ 30 నిమిషాల్లో చేరే సత్తా దీని సొంతమట. 10 శక్తిమంతమైన ఇండిపెండెంట్ వార్హెడ్లతో ఇది ఉంటుందట. ఘన ఇంధనంతో ఇది దూసుకెళుతుందట. ఇటీవల మంగోలియాలోని ఓ సైట్లో చైనా వాటిని పరీక్షించిందట. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) తీసిన శాటిలైట్ ఫొటోల్లో 18 మిసైళ్లు కనిపించాయట. ఇంకా చైనా దగ్గర భారీగానే ఈ మిసైళ్లు ఉండి ఉంటాయని అమెరికా అనుమానం. ఇక, 1997 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చింది చైనా. 2015, 2017 మిలటరీ పరేడ్లలోనే దీన్ని ప్రదర్శిస్తారని భావించినా, చైనా దాన్ని గుట్టుగానే ఉంచింది. అయితే, ఇటీవల బీజింగ్లో నిర్వహించిన పరేడ్ రీహార్సల్స్లో దీన్ని పెట్టడంతో, ఈసారి కచ్చితంగా పరేడ్లో ఇదే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఆ దేశ మీడియా అంటోంది.