రాజన్నసిరిసిల్ల, వెలుగు:రూ. పది వేలు లంచం తీసుకుంటూ గంభీరావుపేట పోలీస్స్టేషన్ రైటర్ పట్టుబడగా.. ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తి, గంభీరావుపేట ఎస్సై అనిల్కు దీంతో సంబంధం ఉందంటూ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఇసుక రవాణాదారుడు సింహాచలం పోలీసుల తనిఖీల్లో మినీ టిప్పర్తో డిసెంబర్19న పట్టుబడ్డాడు. టిప్పర్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రిలీజ్ ఆర్డర్ కోసం రూ.25 వేలు అడగడంతో రూ.10 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పథకం ప్రకారం సింహాచలంతో రూ.10 వేలు ఇప్పించారు. ఈ డబ్బులు నేరుగా రైటర్కనకరాజు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఎస్సై అనిల్ను అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో ఉన్న సీఐ లింగమూర్తిని సైతం ఏసీబీ అధికారులు కారులో ఎక్కించుకొని గంభీరావుపేటకు తీసుకువచ్చి విచారణ జరిపారు. వీరిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
ఫస్ట్ పోస్టింగ్.. డ్యూటీలో చేరిన నెలన్నరకే..
గంభీరావుపేట ఎస్సై అనిల్ఇటీవలే ప్రొబేషన్పూర్తి చేసుకున్నారు. నెలన్నర క్రితం గంభీరావుపేటలో ఫస్ట్ పోస్టింగ్వచ్చింది. ప్రొబేషన్టైంలో తన పనితీరుతో ఎస్పీ చేతులమీదుగా అవార్డు సైతం అందుకున్నారు. ఇప్పుడు ఏసీబీ కేసులో చిక్కుకున్నారు.