
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక దేశంపై మరో దేశం మిస్సైళ్లు, బాంబులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇది చాలదు అన్నట్లు యుద్ధంలోకి అమెరికా ఎంటరవ్వటం.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై భారీ బాంబులతో దాడులు చేయటం జరిగిపోయాయి. ఇదే అదునుగా ఇజ్రాయెల్ మరింత దూకుడుగా ఇరాన్ పై రెచ్చిపోయి దాడి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ తమ మిత్ర దేశం రష్యా సహకారం కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి కీలక సమయంలో రష్యా ఆల్మోస్ట్ చేతులెత్తేసినంత పని చేసి ఇరాన్ ఆశలపై నీళ్లు చల్లింది.
మిత్ర దేశమైన ఇరాన్ కు మద్ధతు ఇవ్వడంలేదని.. ఎందుకు ఇజ్రాయెల్ పై యుద్ధం చేయడం లేదని సోమవారం (జూన్ 23) మీడియా అడిగిన ప్రశ్నలకు.. రష్యా అధ్యక్షుడు చెప్పిన సమాధానంతో ఇరాన్ ఒకింత ఆశ్చర్యానికి గురైందని చెప్పవచ్చు. అటు అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగి యుద్ధం చేస్తుంటే.. రష్యా ఎందుకు దూరంగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పుతిన్ క్లారిటీ ఇచ్చారు.
ఇరాన్ కు ఎప్పటికీ తమ మద్ధతు ఉంటుందని.. దశాబ్దాల కాలంగా ఇరాన్ తమకు మిత్ర దేశంగా ఉందని తెలిపారు. అయితే ఇజ్రాయెల్ విషయంలో న్యూట్రల్ గా ఉండటానికి కారణం.. ఆ దేశంలో 20 శాతం మంది రష్యా మాట్లాడేవారు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్ తో సాంస్కృతి సంబంధాలు ఉన్నాయని.. దాదాపు 20 లక్షల ప్రజలు రష్యన్ భాష మాట్లాడతారని తెలిపారు. అంటే అది దాదాపు రష్యా దేశంగా మారిపోయిందని అన్నారు. అందుకే రష్యా విదేశాంగ విధానంలో ఈ అంశాలు కీలకంగా మారాయని చెప్పారు పుతిన్. ఈ వ్యాఖ్యలు ఇరాన్ ను కాస్త నిరాశపర్చాయనే అంటున్నారు విశ్లేషకులు. ఇజ్రాయెల్ తరఫున అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటమే కాకుండా ఏకంగా ఇరాన్ పై బాంబులతో దాడులు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా రంగంలోకి దిగుతుందని ఆశించిన ఇరాన్ కు ఆశాభంగం అయ్యిందని అంటున్నారు.
ALSO READ | ఎవిన్ జైలు గోడలు బద్దలుకొట్టిన డ్రోన్ బాంబులు : ప్రపంచంలోనే డేంజరస్ ప్లేస్ ఇదేనంట..!
అయితే యుద్ధంపై రష్యా వైఖరిపై వస్తున్న విమర్శలను ఖండించారు పుతిన్. రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా అభివర్ణించారు. రష్యా ఎప్పటి నుంచో ఇరాన్ వెంటే ఉందని.. రష్యాలో దాదాపు 15 శాతం జనాభా ముస్లింలేనని తెలిపారు. గత చరిత్ర చూసినా.. అరబ్, ఇస్లామిక్ దేశాలతో రష్యాకు విడదీయరాని బంధం ఉందని తెలిపారు. ఇరాన్ ప్రజలకు మద్ధతుగా ఉండేందుకు, వారిని కాపాడేందుకు రష్యా ప్రయత్నిస్తోందని అన్నారు.
ఇక అమెరికా యుద్ధంలోకి దగటంపై రష్యా మండిపడింది. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడిని తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడులు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇది అన్యాయమని అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మాస్కోలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాశ్చి తో సమావేశం సందర్భంగా అమెరికా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు, మద్ధతుగా నిలిచేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.