టూర్లు పోస్ట్​పోన్​ చేసుకుంటున్న సిటీ జనం

టూర్లు పోస్ట్​పోన్​ చేసుకుంటున్న సిటీ జనం
  • సర్వీసులు పెంచాలని రైల్వే అధికారులకు రిక్వెస్టులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే టికెట్లు దొరకడం లేదు. నెల రోజుల ముందు బుక్​చేసుకున్నా వెయిటింగ్ లిస్ట్​ఉంటోంది. అప్పటికప్పుడు జర్నీ అనుకుంటే టికెట్లు దొరికే పరిస్థితి లేదు. రెండు నెలలు, కొన్ని ప్రాంతాలకు మూడు నెలల ముందే బుక్​చేసుకోవాల్సి వస్తోంది. సౌత్, నార్త్ ఇండియాలోని టూరిస్టు ప్లేసులకు రైళ్లలో వెళ్లాలంటే రెండు, మూడు నెలల ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. 15, నెల రోజుల ముందు డిసైడ్​అవుతున్నవారికి టికెట్లు దొరకక పోస్ట్​పోన్​చేసుకుంటున్నారు. కొందరు వెయిటింగ్​లిస్ట్​లో ఉన్నా జర్నీకి ఒకరోజు ముందు వరకు చూస్తున్నారు. అప్పటికీ కన్ఫామ్​కాకపోవడంతో క్యాన్సిల్​చేస్తున్నారు. తాత్కాల్​లోనూ చాలా ట్రైన్లకు దొరకడం లేదు. దీంతో టూర్లనే పోస్ట్​పోన్​చేసుకుంటున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ఢిల్లీ, నాగ్ పుర్, పట్నా, రాక్ సోల్, బిహార్, దర్భంగా, హౌరా, జైపూర్, ఇండోర్, రాజ్ కోట్, గౌహతి, తిరుపతి, వైజాగ్, విజయవాడ, చెన్నై, మధురై, ముంబై, త్రివేండ్రం తదితర ప్రాంతాల్లోని ఒకటి, రెండు ప్రాంతాలకు మినహా ఈ నెలలో టికెట్లు అందుబాటులో లేవు. ఆన్ లైన్​పై అవగాహన ఉన్నవారు తాత్కాల్​లో ట్రై చేస్తున్నారు. లేనివారితోపాటు, సర్వీస్​చార్జీలు ఎందుకు చెల్లించాలనుకునేవారు రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్తున్నారు. రిజర్వేషన్ ఫాం ఫిల్ చేసి కౌంటర్ లో ఇచ్చాక వెయిటింగ్​లిస్ట్​ఉందని తెలిసి వెనుదిరుగుతున్నారు.

రైళ్లలోనే ఎక్కువ మంది

సిటీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లనే ఆశ్రయిస్తారు. అతి తక్కువ మంది ఫ్లైట్లలో వెళ్తుంటే దాదాపు 90 శాతం మంది ట్రైన్లలోనే వెళ్తున్నారు. టికెట్లు దొరకపోతే జర్నీని పోస్ట్​పోన్​చేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవెట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కుతున్నారు. ఫ్లైట్లు, బస్సుల్లో కంటే రైళ్లలో జర్నీ చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీంతో రైళ్లలో ఎప్పుడూ రష్​ఉంటోంది. స్కూళ్లు, కాలేజీలు, పండుగ సెలవుల్లో రైళ్లలో వెయిటింగ్​లిస్ట్​చాంతాడంత ఉంటోంది.

స్పెషల్ ట్రైన్లు వేస్తున్నా..

జనం అవసరాన్ని బట్టి స్పెషల్ ట్రైన్లు వేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నా, చాలా ప్రాంతాలకు సరిపోవడం లేదు. ఒక రూట్​లో  ట్రైన్ తిప్పాలంటే ఆ రూట్ లో రెగ్యులర్ గా 1,500 నుంచి 2 వేల మంది ప్రయాణించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరీ ఎక్కువగా ఉంటే స్పెషల్ ట్రైన్స్ వేస్తున్నామని అంటున్నారు. కొత్త సర్వీసులు నడపాలంటే బోర్డు నిర్ణయం తీసుకోవాలంటున్నారు. 

వెయిటింగ్ లిస్ట్ వచ్చింది

ఫ్రెండ్స్​ తో కలసి ఈ నెల 8న తిరుపతి వెళుతున్నం. ట్రైన్​టికెట్లు తీసుకుందామని నాంపల్లి రిజర్వేషన్ కౌంటర్ కి వచ్చాను. వెయిటింగ్ లిస్ట్ ఉంది. కన్ఫామ్​అవుతుందో లేదో చెప్పలేమని రైల్వే సిబ్బంది చెప్పారు. కన్ ఫాం అయితే ఓకే. లేకుంటే బస్సులో వెళ్లాలి.  

- కాస్తిపురం మల్లికార్జున్, సిటిజన్

టూర్ పోస్ట్ పోన్ చేసుకున్నం

నార్త్ ఇండియా టూర్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటే రైళ్లలో టికెట్లు దొరకడం లేదు. నెల రోజుల ముందు ప్లాన్ చేసుకున్నా వెయిటింగ్​లిస్ట్​తగ్గడం లేదు. మరో రెండు నెలల తరువాత వెళ్దామని అనుకుంటున్నా. మా బ్యాచ్​లో చాలా మందికి బస్​జర్నీ పడదు. అందుకే ట్రైన్ టికెట్ల కోసం చూస్తున్నాం.

- ధరమ్, సిటిజన్​