- ఫేక్ గోల్డ్ బాల్స్ ను అమ్ముతూ మోసాలు
- ముగ్గురు అరెస్ట్.. రూ.15 లక్షలు స్వాధీనం
హైదరాబాద్,వెలుగు: నకిలీ బంగారాన్ని అమ్ముతూ మోసాలు చేస్తున్న ముగ్గురిని సిటీ సౌత్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.15 లక్షల క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. కర్నాటకలోని కొలార్ జిల్లా రాయల్పాడ్కి చెందిన శివయ్య(30), తిరుపతయ్య(25), చిత్తూరు జిల్లా పలెంపల్లె గ్రామానికి చెందిన ఇంద్రాజ్(27) గ్యాంగ్గా ఏర్పడి మెటల్ బాల్స్కి బంగారు పూత వేసి అవి తమ పొలంలో దొరికాయని, వాటిని తక్కువ రేటుకే అమ్ముతామని మోసాలు చేస్తున్నారు. చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్ నగర్ కి చెందిన విజయ్ కుమార్ కేఎల్ కే లాజిస్టిక్స్ అండ్ బస్ టికెట్స్ బుకింగ్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. గత నెల మొదటివారంలో విజయ్ కుమార్ ట్రావెల్స్ దగ్గరకు వచ్చి ఈ గ్యాంగ్ మెంబర్ బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత ట్రావెల్స్ విజిటింగ్ కార్డును తీసుకుని వెళ్లాడు. అదే నెల 9న విజయ్ కుమార్కి ఈ గ్యాంగ్ సభ్యులు కాల్ చేశారు. మైసూరులోని తమ వ్యవసాయ భూమిలో బంగారం దొరికిందని చెప్పారు. తమపై పోలీసుల నిఘా ఉందని..బంగారాన్ని తక్కువ రేటుకే అమ్ముతామని ట్రాప్ చేశారు. గత నెల 14న సాయంత్రం 4.30 గంటలకు బండ్లగూడ ఎంఎం కాలనీలోని కట్టమైసమ్మ టెంపుల్ వద్దకు శివయ్య, తిరుపతయ్య, ఇంద్రాజ్ వచ్చారు. విజయ్ కుమార్కు నకిలీ గోల్డ్ బాల్స్ ఇచ్చి రూ.17 లక్షలు తీసుకుని ఎస్కేప్ అయ్యారు. గత నెల 21 బాధితుడు చాంద్రాయణగుట్ట పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఫేక్ గోల్డ్ గ్యాంగ్ను ఏపీలోని మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు.