
- అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం
- వారి సమస్యలు మాకు తెలుసు.. పరిష్కరిస్తం: సీఎం
- ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తం
- మెగా మాస్టర్ ప్లాన్ -2050 తెస్తం
- దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ కావాలని ఆకాంక్ష
- బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్కు హాజరు
హైదరాబాద్, వెలుగు: ఏ దేశ అభివృద్ధిలోనైనా బిల్డర్లు కీలక పాత్ర పోషిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేండ్లలో బిల్డర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, వాటన్నింటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో శనివారం జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్లో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం మెగామాస్టర్ ప్లాన్ –2050 తీసుకొస్తామని ప్రకటించారు. మనదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ సహా అన్ని వర్గాలకు అవసరమైన ఇన్ఫ్రాను డెవెలప్ చేస్తామని చెప్పారు. ‘‘ఈ ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికే మేం ఇక్కడికి వచ్చాం. మీరు బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం బిల్డర్స్ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపుతుంది. హైదరాబాద్ జీవన విధానం మూసీనది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారంతో నిజాం ప్రభుత్వం హిమాయత్సాగర్ వంటి ప్రాజెక్టులను, చెరువులను నిర్మించింది. అందుకే హైదరాబాద్కు లేక్ సిటీ అనే గుర్తింపు వచ్చింది.
మూసీ నదిని పునరుద్ధరించడానికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నది. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050ని తీసుకు రాబోతున్నాం. త్వరలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఆహ్వానిస్తాం. ఇందుకు మీ సహకారం ఎంతో అవసరం” అని బిల్డర్స్తో సీఎం అన్నారు. పనులను కాంట్రాక్టర్లు సరైన సమయంలో చేయాలని సూచించారు. ‘‘గత పదేండ్లలో మీరు ఎదుర్కొన్న సమస్యలు మాకు తెలుసు. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ వంతు పాత్ర పోషించారు. ఎన్నో గొప్ప నిర్మాణాలను బిల్డర్లు, కాంట్రాక్టర్లు కట్టారు. దేశ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో మీ పాత్ర కీలకం. మీ సమస్యలను వింటం. పరిష్కరిస్తం” అని ఆయన అన్నారు.
మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు: వెంకట్రెడ్డి
రీజనల్ రింగ్ రోడ్డు పనులు మరో మూడు నెలల్లో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. దీనివల్ల 5 జిల్లాలకు రాకపోకలు మరింత దగ్గర అవుతాయన్నారు. అభివృద్ధికి నిర్మాణ రంగం కీలకమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు భాగస్వాములని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు పారదర్శక, స్నేహపూర్వక ప్రభుత్వం ఉందని, హైదరాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులను సరిగ్గా చెల్లించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలమయంగా మారిందని అన్నారు. గత ప్రభుత్వం రూ. ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం బిల్డర్ల, కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. సదస్సులో బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బొల్లినేని శీనయ్య తదితరులు పాల్గొన్నారు.