
నారాయణపేట, వెలుగు: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక్కడ నిర్వహించనున్న జన జాతర సభలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి సీఎం పాల్గొంటారు. స్థానిక మినీ స్టేడియంలో జరగనున్న ఈ సభకు పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రేవంత్ సోమవారం సాయంత్రం 4.45కు హెలికాప్టర్ లో నారాయణపేటకు చేరుకుని, 5 గంటలకు మినీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు. సభ అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్ తిరిగి వెళ్తారు. సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్చార్జి శివకుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఎస్పీ యోగేశ్గౌతమ్ సభాస్థలి, హెలిప్యాడ్ను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.