సింగరేణికి టార్గెట్​ టెన్షన్

సింగరేణికి టార్గెట్​ టెన్షన్

సింగరేణికి టార్గెట్​ టెన్షన్

లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు మూడు లక్షల టన్నుల బొగ్గు తవ్వాలె

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్​కంపెనీకి కోల్ ​ప్రొడక్షన్ ​టార్గెట్ ​టెన్షన్ ​పట్టుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అధికారికంగా 70 మిలియన్​ టన్నుల బొగ్గు తవ్వాలని సింగరేణి నిర్దేశించుకుంది. ఇంటర్నల్​గా 74 మిలియన్​టన్నులు టార్గెట్​గా పెట్టుకుంది. ఇంటర్నల్​టార్గెట్​పక్కన పెడితే అధికారికంగా నిర్దేశించుకున్న 70 మిలియన్​ టన్నుల బొగ్గు తీయడం సైతం కష్టంగా మారింది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకునే టైంలో అండర్​ గ్రౌండ్​ మైన్ల నుంచి ఎంత తవ్వొచ్చు, ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్ట్​ల నుంచి ఎంత బొగ్గును ఉత్పత్తి చేయవచ్చో ముందుగానే ప్లాన్​ చేసుకుంటారు. ఇందులో భాగంగానే కొత్త మైన్స్​నుంచి ఎంత ఓబీ తీయాలి, ఎంత బొగ్గు ఉత్పత్తి అవుతుందో ప్రణాళిక రూపొందిస్తారు.

ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్​ పనులు పూర్తి కాకుండానే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను యాజమాన్యం నిర్దేశించింది. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ నుంచి కోల్​ప్రొడక్షన్​టార్గెట్​ను పెట్టుకుంది. కానీ నైనీ ప్రాజెక్ట్​తో పాటు కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీల నుంచి ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. నైనీ ప్రాజెక్ట్​ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఒక్క బొగ్గు పెళ్ల కూడా తవ్వలేదు. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ నుంచి దాదాపు 10 లక్షల టన్నుల బొగ్గు తీయాల్సి ఉన్నప్పటికీ ఈ మైన్​కు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులే రాలేదు. ఎన్విరాన్​మెంట్ క్లియరెన్స్​వచ్చేసరికి కనీసం ఇంకా రెండు మూడు నెలల టైం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది కోల్ ప్రొడక్షన్ ​లక్ష్యాలను అధికారికంగా నిర్దేశించుకునే క్రమంలో అవసరమైన ప్రణాళికలను రూపొందించడంలో యాజమాన్యం విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మిగిలింది నెల రోజులే..

ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలంటే ఈ నెలలో రోజుకు కనీసం మూడు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల నుంచి 2.22 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​ నుంచి ఫిబ్రవరి వరకు 66.5 మిలియన్ ​టన్నులకు గానూ 59.9 మిలియన్​టన్నుల బొగ్గు తవ్వారు. ఏప్రిల్​నుంచి ఫిబ్రవరి వరకు ఇల్లెందు, మణుగూరు, ఆర్జీ–1, ఆర్జీ–2 ఏరియాలు మాత్రమే నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి. అడ్రియాల ప్రాజెక్ట్, భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలు కనీసం 80 శాతం కూడా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలో రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను భారీగా సాధించేందుకు యాజమాన్యం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా కంపెనీ సీఎండీ శ్రీధర్ ​కంపెనీలోని డైరెక్టర్లు, ఏరియా జనరల్​మేనేజర్లు, ఏజెంట్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహిస్తున్నారు. గతేడాది దాదాపు 65 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా కనీసం ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ సాధించి ప్రతిష్టను కాపాడుకునేందుకు యాజమాన్యం ముమ్మర చర్యలు చేపట్టింది.