గద్వాల, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో డ్యూటీ చేసే ఆఫీసర్లు పోలింగ్ నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ల రెండో దశ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలను సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
పోలింగ్ లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఓటరు తమ ఓటు గల్లంతైందని, ఇతర సమస్యలు చెప్పకుండా ముందుగానే పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ నిర్వహణలో ఏవైనా సందేహాలు ఉంటే మాస్టర్ ట్రైనర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
రెండో విడత పోలింగ్ కు సిబ్బంది కేటాయింపు..
రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమేజేషన్ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్ తో కలిసి రెండో విడత పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ నిర్వహించారు.
అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో 716 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 716 ఓపీవోలు, 1,007 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. డీపీవో శ్రీకాంత్, జడ్పీ సీఈవో నాగేంద్రం, ఈడీఎం శివ పాల్గొన్నారు.
