అలంపూర్, వెలుగు: ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. డిజిటల్ స్క్రీన్లతో బోధించే పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూడైస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పాఠశాల తరగతి గదిలో అంగన్వాడీ కేంద్రం నడుస్తుండడంతో, త్వరలోనే పక్కా భవనం నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నెల రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.
కలుకుంట్ల మొక్కజొన్న సెంటర్ పరిశీలన..
కలుకుంట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, ఏఈఓ రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు.
మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ తనిఖీ
మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ను కలెక్టర్తనిఖీ చేశారు. భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. మండలంలో 508 సాదాబైనామాలు, 60 భూభారతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు చేయాలి
సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తి ఆరబెట్టుకుని వచ్చేలా సంబంధిత ఏఈవోలు అవగాహన కల్పిస్తే, రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోలు జరుగుతుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తున్నందున రైతులు దాని ప్రకారం ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు.
ప్రస్తుతం స్లాట్ బుకింగ్ విధానంలో ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తుండగా, 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని, అకాల వర్షాలతో పత్తి దెబ్బతినడంతో తేమ ఎక్కువగా ఉన్న కొనాలని పలువురు రైతులు కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాహనాల్లో రైతులు అమ్మేందుకు తీసుకొచ్చిన పత్తిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ జిన్నింగ్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, సీసీఐ అధికారి రాహుల్ కలాన తదితరులున్నారు.
చిన్న నీటి వనరుల లెక్క పక్కాగా నిర్వహించాలి
గద్వాల : జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన మీటింగ్లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఏడో మైనర్ ఇరిగేషన్, రెండో వాటర్ బాడీ సెన్సెస్పై చర్చించారు. చిన్న నీటిపారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. జల వనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
