
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బాలానగర్, భూత్పూర్, గండీడ్, మహమ్మదాబాద్, జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్ పేట, రాజాపూర్, మండలాల్లోని 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈవో వెంకట్రెడ్డి, డీపీవో పార్థసారథి, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
ఆర్వోలు కీలకపాత్ర పోషించాలి
మహబూబ్ నగర్ (నారాయణ పేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 13 జడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో, 272 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వా ర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.
నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
వనపర్తి: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ యాదయ్య ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నామినేషన్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్ పాల్గొన్నారు.
సరిహద్దులో ముమ్మర తనిఖీలు..
అలంపూర్: తెలంగాణ, ఏపీ సరిహద్దులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సరిహద్దు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఏపీ నంచి వస్తున్నవాహనాలను ఎస్సై కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తున్నారు. నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టే వస్తువుల తరలింపుపై నిఘా పెట్టినట్లు చెప్పారు. మూడు షిఫ్ట్లలో 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తామని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వెంట తీసుకెళ్లవద్దని సూచించారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకెళ్తుంటే సంబంధిత పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.