
మహబూ నగర్ కలెక్టరేట్, వెలుగు: హాస్టళ్లు, వసతిగృహాల్లో అన్ని సౌలతులు కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం నగరంలోని గురుకుల కళాశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. అప్పన్నపల్లి తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీ, పిల్లలమర్రి సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించి క్లాస్రూమ్స్, డార్మెటరీ, టాయిలెట్లను పరిశీలించారు.
సౌలతుల ఏర్పాటుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ హాస్టల్ రూమ్స్ డార్మెటరీ కిటికీలకు మెష్ ఏర్పాటు చేయాలని, డోర్లు, కిటికీల రిపేర్లు చేపించాలన్నారు. పిల్లలమర్రి డిగ్రీ కాలేజీలో విద్యార్థుల భద్రత, అభ్యాసం, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్, కాలేజీ ప్రిన్సిపాళ్లు ఉన్నారు.