
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈనెల 16న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రిని సందర్శించనున్నారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. గురువారం పిల్లల మర్రిలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ సుందరీమణుల పర్యటనను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమష్టిగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సుమారు 750 సంవత్సరాల చరిత్ర గల, పిల్లల మర్రి చెట్టు, పురావస్తు మ్యూజియం, రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థా నాన్ని వారు సందర్శించనున్నారని తెలిపారు. ఎస్పీ డి. జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ సత్యనారాయణ, డీఆర్డీఓ నరసింహులు, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఆర్డీవో నవీన్, డీఈఓ ప్రవీణ్ కుమార్, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.