నిత్యావసరాల ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్పై రూ.39.50 తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తగ్గించిన కొత్త రేట్లు ఈ రోజు నుంచే అంటే డిసెంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి.
తాజాగా ప్రకటించిన ధరల తగ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో రూ.1796.50 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ధర రూ.1,757కు తగ్గింది. ముంబయిలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868, చెన్నైలో రూ.1,929గా ఉంది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.