న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి పలు నగరాల్లో లాక్డౌన్ విధించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో మమమ్మారి వ్యాప్తి గురించిన ఓ విషయం భయపెడుతోంది. దేశంలో కరోనా సమూహ వ్యాప్తి మొదలవ్వలేదని డాక్టర్స్ అంటున్నారు. అయితే తమ రాష్ట్రంలోని కరోనా క్లస్టర్స్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రేటు 50 శాతానికి పైగా ఉందని కేరళ హెల్త్ మినిస్టర్ కేకే శైలజ చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
‘ఇవ్వాళ్టికి కేరళలో 84 కరోనా క్లస్టర్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్స్ లోపల వైరస్ వ్యాప్తి 50%కి పైగా ఉంది. కానీ క్లస్టర్స్కు వెలుపల కేవలం 10 శాతం మాత్రమే ఉంది. క్లస్టర్ ఫార్మింగ్ను, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ను మేం నియంత్రించాలి. సమూహ వ్యాప్తి అవుతున్న చైన్ను ఆపడానికి మేం యత్నిస్తున్నాం. దీని కోసం క్లస్టర్స్ను లాక్ చేస్తున్నాం. ముఖ్యంగా తీర ప్రాంతాలపై మేం ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంది’ అని శైలజ చెప్పారు. మేలో కేరళలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువకు పడిపోగా, ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న వారు స్వస్థలాలకు తిరిగి రావడంతో వైరస్ ఉధృతి ఎక్కువైంది. కేరళలో 11 వేల కరోనా కేసులు నమోదవగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు పైగా ఉంది.