
హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు' అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమని పేర్కొన్నారు.
2014 నుంచి 2024 వరకు - తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం, చలనచిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించటం అభినందనీయమన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ 10 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోంది.
ఇప్పటికే 2014 నుంచి 2024 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సినిమాలకు, నటులు, దర్శకులు, టెక్నిషియన్లకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. 2025, జూన్ 14న హైదరాబాద్లోని హెటెక్స్ లో విజేతలకు గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.