చైనాతో సరిహద్దు వ్యవహారంలో..మోదీ ఫెయిల్​ : మల్లికార్జున ఖర్గే

చైనాతో సరిహద్దు వ్యవహారంలో..మోదీ ఫెయిల్​ : మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ :  చైనాతో సరిహద్దు వ్యవహారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్​అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జాతీయ భద్రతను ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు. లడఖ్​  పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని ఫైర్​ అయ్యారు. ఇది మోదీ చైనీస్​ గ్యారెంటీ అంటూ ఎద్దేవా చేశారు. లడఖ్​ను పరిరక్షించేందుకు, సరిహద్దుల్లో జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్​ కట్టుబడి ఉన్నదని ఖర్గే నొక్కి చెప్పారు. లడఖ్​లోని గిరిజన సమూహాలకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్​ ప్రకారం రక్షణ కల్పించాలని ప్రజలనుంచి భారీ మద్దతు ఉన్నదని తెలిపారు.   ‘మోదీ అన్ని హామీల్లాగానే లడఖ్​ ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పిస్తామనే హామీ కూడా ఓ భారీ ద్రోహంగా మిగిలిపోయింది. 

ఈ హామీ నకిలీ.. చైనా మాల్​లాంటిదే’ అని ఖర్గే ఎక్స్​లో చురకలంటించారు. లడఖ్​ కేంద్ర పాలిత ప్రాంతానికి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని పర్యావరణవేత్త సోనమ్​ వాంగ్​చుక్​ చేస్తున్న నిరాహార దీక్ష నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. లడఖ్​లోని పర్యావరణ సున్నితమైన హిమానీనదాలను దోపిడీచేసి, వారి క్రోనీ ఫ్రెండ్స్​కు లబ్ధి చేకూర్చేందుకు మోదీ యత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ‘గల్వాన్​ వ్యాలీలో 20 మంది సైనికుల ప్రాణత్యాగం తర్వాత కూడా మోదీ చైనాకు క్లీన్​చీట్​ ఇచ్చారు. అదే ఇప్పుడు మన సరిహద్దుల్లోకి చైనా విస్తరించేందుకు ప్రోత్సహించింది’ అని దుయ్యబట్టారు. దేప్పాంగ్​ ప్లెయిన్స్​, హాట్​ స్పింగ్స్​, గోగ్రా రీజియన్​లో భారత భూభాగాన్ని ఆక్రమించడాన్ని చైనా కొనసాగిస్తున్నదని తెలిపారు. ఇది మోదీ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.