పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఆశ చూపి దగా చేశారు : పూజల హరికృష్ణ

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఆశ చూపి దగా చేశారు : పూజల హరికృష్ణ

సిద్దిపేట రూరల్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశ చూపి వారిని దగా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టి పేదల కళ్లల్లో ఆనందాన్ని నింపామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ అన్నారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కేదారి సదాశివారెడ్డితో కలిసి ఇటీవల జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పట్టాలను అందుకున్న పలువురు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించారు. 

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్​పాలనలో బీఆర్ఎస్ నేతలు ఒరగబెట్టిందేమీ లేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేశారని, నాట్ల సమయానికి రైతు భరోసా అందించారని గుర్తుచేశారు. కేసీఆర్​గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టాడన్నారు.

 అర్హులందరికీ డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఎక్కడా కూడా వాటిని నిర్మించలేదని, కొన్ని చోట్ల నిర్మించినా స్థానిక లీడర్లు వాటిని డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన వెంట బొమ్మల యాదగిరి, కలీమోద్దిన్, అంజి రెడ్డి, మల్లారెడ్డి, రాజిరెడ్డి, మాధవ రెడ్డి పాల్గొన్నారు.