ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.485 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎప్పుడూ హైదరాబాద్లో మంత్రుల పేషీల చుట్టూ తిరుగుతూ, సీఎంతో ఫొటోలు దిగుతూ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్నారు. సీసీఐ కూల్చివేతకు ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలన్నారు. బీజేపీ ఎంపీ గోడం నగేశ్కు కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. కాగజ్నగర్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీజేపీది మత రాజకీయం..
బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ ఆరోపించారు. ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలో బీజేపీ నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. అందుకే ఎన్నికను మున్సిపల్ చైర్పర్సన్ అనూష వాయిదా వేశారన్నారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖిజర్ పాషా, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
