బీఆర్ఎస్ ​వాళ్లను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. ఒంటిపై పెట్రోల్​ పోసుకున్న కాంగ్రెస్ ​నేత

బీఆర్ఎస్ ​వాళ్లను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. ఒంటిపై పెట్రోల్​ పోసుకున్న కాంగ్రెస్ ​నేత

వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్​నాయకులను కాంగ్రెస్​పార్టీలో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్​పేట మండల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు, తాడిపర్తి మాజీ సర్పంచ్​ గణేశ్​గౌడ్​ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిరసన తెలిపాడు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం ఎమ్మెల్యే ఇంటి వద్ద గోపాల్​పేట మండలం తాడిపర్తికి చెందిన బీఆర్ఎస్​ లీడర్, కాంగ్రెస్​పార్టీ నాయకుడు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అనుచరులతో కలిసి అక్కడికి వచ్చిన గణేశ్​గౌడ్​తనకు బీఆర్ఎస్​ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారనే విషయం గురించి చెప్పలేదని, గత ప్రభుత్వ హయాంలో తన ప్రత్యర్థి తనపైనా, తన అనుచరులపైన మంత్రి సహకారంతో అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించాడు. 

ఎన్నికల ప్రచారంలోనూ తిరగనివ్వలేదని, అలాంటి వారిని ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో నాయకుడికి గణేశ్​గౌడ్​కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గణేశ్​మరో ఇద్దరు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకుని  కాల్చమంటూ అగ్గిపెట్టను ఎమ్మెల్యే పైన వేశాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడి నాయకులు, కార్యకర్తలు పెట్రోల్​పోసుకున్న వారిని పక్కను లాగేశారు. పోలీసులు అందరినీ పక్కకు జరిపారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్​ లీడర్​లోకారెడ్డితో పాటు మరికొంతమందిని  పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిసి ఆవేశంతో ఒంటిపై పెట్రోలు పోసుకున్నానని గణేశ్​గౌడ్​ ఆవేదన వ్యక్తం చేశాడు. గణేశ్​గౌడ్​చిన్నారెడ్డి అనుచరుడు.