పేర్లు మార్చుతూ కుట్రలు చేస్తున్న బీజేపీ..గాంధీ విగ్రహాల వద్ద ఆందోళనలు

పేర్లు మార్చుతూ కుట్రలు చేస్తున్న బీజేపీ..గాంధీ విగ్రహాల వద్ద ఆందోళనలు
  •     ఉపాధి హమీ పథకం నుంచి  మహాత్మా గాంధీ పేరును తొలగిండంపై కాంగ్రెస్ ఫైర్

కోల్​బెల్ట్, వెలుగు: ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం సిగ్గుమాలిన చర్య అని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ ​పిన్నింటి రఘునాథ్​రెడ్డి మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆదివారం రామకృష్ణాపూర్​లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్​ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం పేరు చెబితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడతాయన్నారు. 

కాంగ్రెస్​2004లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంతో స్వగ్రామాల్లోనే పనిదొరకడం వల్ల వలసలు తగ్గాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరిందన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ స్కీమ్​ నిధులకు కోత పెట్టిందన్నారు. ఇప్పుడు పేరు మార్చి కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకు ముందునల్ల బ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్ ​పల్లె రాజు, లీడర్లు ఒడ్నల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్​ అజీజ్, మున్సిపల్​ మాజీ చైర్మన్​ జంగం కళ, కనకరాజు, శ్యామ్​ గౌడ్, కల్యాణ్  పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతోందని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్​సుజాత ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ ఆదిలాబాద్​లోని గాంధీ చౌక్​లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు లోక ప్రవీణ్ ​రెడ్డి, సంజీవ్​ రెడ్డి, శ్రీలత, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు 

కాగ జ్ నగర్, వెలుగు: ఉపాధి హామీ పథకం నుంచి  మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై ఆసిఫాబాద్​జిల్లా​కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాన్ని  నిరసిస్తూ ఆదివారం కాగజ్​నగర్​తో పాటు పలు మండలాల్లో గాంధీ విగ్రహాల ముందు నిరసన దీక్ష చేశారు. ఉపాధి హామీ పథకానికి పెట్టిన కొత్త పేరును వెనక్కి తీసుకొని గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.