రెడ్ కార్పెట్ పరిచి.. పూలు చల్లి.. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ ఆందోళన

రెడ్ కార్పెట్ పరిచి.. పూలు చల్లి.. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ ఆందోళన
  •     అసెంబ్లీకి హాజరు కావాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్

గజ్వేల్​/ములుగు, వెలుగు: ప్రతిపక్ష నేతగా, గజ్వేల్​ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్​ అసెంబ్లీకి పోవాలని లేదంటే వెంటనే రాజీనామా చేయాలని గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ ఆంక్షరెడ్డి డిమాండ్​ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్​ ఫామ్​ హౌస్​​గేట్​ వద్ద రెడ్​ కార్పెట్​ పరిచి, పూలు జల్లి కేసీఆర్​ బయటకు రావాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్న నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ నడుస్తున్నా కేసీఆర్​ ఫామ్​హౌస్​లోనే ఉంటున్నాడని తెలిపారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలని, రాష్ట్ర సమస్యలు ప్రస్తావించాలని, వాటిని అందరం కలసి పరిష్కరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినా కేసీఆర్​ సంతకం చేసి వెళ్లిపోవడం సరైంది కాదన్నారు. గజ్వేల్​లో కేసీఆర్  స్టార్ట్  చేసిన పెండింగ్  పనులను కంప్లీట్  చేయాలని కోరారు. 

మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులకు డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, సమస్యలు తీర్చాలన్నారు. లేదంటే పదవికి రాజీనామా చేస్తే, పని చేసే వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తాడన్నారు. గతంలోనూ అనేక కార్యక్రమాలు చేపట్టినా బయటకు రావడం లేదన్నారు. గజ్వేల్, ఒంటిమామిడి ఏఎంసీ చైర్మెన్లు వంటేరు నరేందర్ రెడ్డి, విజయమోహన్, వైస్​ చైర్మన్లు సర్ధార్​ఖాన్, ప్రభాకర్​గుప్తా పాల్గొన్నారు.