
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బరిలో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ చేయడం ఖాయమైతే ఆఖరు రోజు గురువారమే కావడంతో ఇయ్యాల్నే దిగ్విజయ్ నామినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సోనియాతో మాట్లాడేందుకు ఆయన బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ చీఫ్ పోస్టుకు పోటీ చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు, ఆ విషయంపై ఎవరితో చర్చించలేదన్నారు. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేరళ ఎంపీ శశిథరూర్ల నామినేషన్ దాదాపుగా ఖాయం కాగా దిగ్విజయ్ రాకతో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని పార్టీ నేతలు అంటున్నారు. సీఎం పోస్టుకు గెహ్లాట్ రాజీనామా చేస్తారనే ప్రచారాన్ని రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కఛరియావాస్ కొట్టి పారేశారు.