![మజ్లిస్ కోటను ఢీ కొట్టేలా కాంగ్రెస్ ప్లాన్!](https://static.v6velugu.com/uploads/2023/11/congress-will-try-its-best-to-gain-a-foothold-in-the-old-city_ZAgEHuTFo9.jpg)
- సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఇవ్వని ఎంఐఎం
- తీవ్ర మనస్తాపంలో ముంతాజ్ ఖాన్, ఆయన మద్దతుదారులు
- వారితో మంతనాలు కొనసాగిస్తున్న హస్తం నేతలు
- రెండ్రోజుల్లో ఏదో ఒకటి చెప్పాలంటూ సూచన
హైదరాబాద్,వెలుగు : ఓల్డ్ సిటీలో పాగా వేసేందుకు కాంగ్రెస్ తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మజ్లిస్ కోటను ఢీకొట్టాలని, ఏడు సెగ్మెంట్లలో రెండింటిని చేజిక్కించుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నాంపల్లి నుంచి బలమైన అభ్యర్థి ఫిరోజ్ఖాన్ను బరిలోకి దింపింది. ఇక చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్కు మజ్లిస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీన్ని కాంగ్రెస్తనకు అవకాశంగా మలుచుకునేందుకు ప్లాన్ చేసింది.
ముంతాజ్ఖాన్ను పార్టీలోకి రావాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ఆయనతో మంతనాలు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగానే చార్మినార్నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకుండా వెయిటింగ్లో పెట్టింది. ముంతాజ్ ఖాన్ పార్టీలోకి వస్తే ఆయననే ప్రకటించనుంది. కాగా మజ్లిస్ పార్టీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నది. ముంతాజ్ ఖాన్కు అత్యంత సన్నిహితుడైన జాఫర్ పహిల్వాన్పై పోలీసు కేసులతో ఇబ్బంది పెట్టిస్తుంది. ఒక విధంగా ఇది ముంతాజ్ఖాన్ను బెదిరించడమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముంతాజ్.. మజ్లిస్ను వీడితే కేసుల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ..
40 ఏండ్లకు పైగానే మజ్లిస్లో కొనసాగుతున్న ముంతాజ్.. తనకు మాత్రమే కాకుండా, తన కొడుక్కి కూడా టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. కానీ ఆయన సేవలను పార్టీకి వాడుకుంటామని, అనుభవం ఎంతో అవసరమని ఇటీవల మీడియా సమావేశంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకుండా, కాంగ్రెస్లో చేరకుండా ముంతాజ్ అనుచరులపై మజ్లిస్ కేసులు నమోదు చేయిస్తున్నట్లు ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముంతాజ్ కాంగ్రెస్లో చేరాలా? లేక ఇండిపెండెంట్గా పోటీ చేయాలా? అనే డైలామాలో ఉన్నట్టు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే నామినేషన్ప్రక్రియ ఈనెల 10వ తేదీతో ముగియనుండడంతో వెంటనే దీనిపై తేల్చాలని కాంగ్రెస్ సూచించింది.